ఎవరిది అహంకారం..ఎవరిది ఆత్మ గౌరవం?

అహంకారం వల్లే గత ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారని, ఈ సారి ఎన్నికల్లో టికెట్ వచ్చిన అభ్యర్థులు ఎవరూ అలా అహంకారంతో ఉండొద్దని సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలకు జూపల్లి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చెప్పింది వినలేదనే తనకు అహంకారం అంటున్నాడని షాకింగ్ కామెంట్లు చేశారు. తనది అహంకారం కాదని.. ఆత్మగౌరవం అని జూపల్లి అన్నారు.

కేసీఆర్‌కి బీజేపీతో ఎప్పటి నుంచో లోపాయికారీ ఒప్పందం ఉందని, గతంలో బీజేపీతో ఒప్పందం చేసుకోమని తనకు కేసీఆర్ చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభావం ఉమ్మడి జిల్లా మొత్తం ఉంటుందనే కేసీఆర్ తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్‌ పగటి వేశగాడి లెక్క వేషాలు మారుస్తున్నారని, అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అని షాకింగ్ కామెంట్లు చేశారు. ఢిల్లీకి పోతే రాహుల్, సోనియా గాంధీలు కలుస్తారని, మీ లెక్క కాదు వారు అని వ్యాఖ్యానించారు. నీ బిడ్డ కవిత మేనేజ్ చేయలేకనే ఓడిపోయిందా?. మరి నువ్వెందుకు ఒడిపోయావు.. వినోద్ ఎందుకు ఓడిపోయాడు అని ప్రశ్నించారు. కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు.

కేసీఆర్‌ నోరు తెరిస్తే అబద్ధాలే, మాట మీద నిలబడే వ్యక్తి కాదు అని దుయ్యబట్టారు. కేసీఆర్‌ తన కాలి గోటికి సరిపోరని, ఏ విషయంలో తన కంటే గొప్పోడని జూపల్లి షాకింగ్ కామెంట్లు చేశారు. అహంకారంలో కేసీఆర్‌ని మించిన వాళ్లు ఎవరున్నారని ప్రశ్నించారు. డబ్బు, అధికారం ఉందనే అహంకారంతోనే ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. మాట్లాడటానికి బుద్దుండాలని, అంబేద్కర్‌కి పూలమాల వేయకుండా, అమర వీరుడి కుటుంబాన్ని పరామర్శించకుండా ఉన్న కేసీఆర్ ది అహంకారమని మండిపడ్డారు. ఎమ్మెల్యే, మంత్రులను కూడా కలవకుండా అహంకారంతో ఉన్నది నువ్వు, నన్ను వేలు పెట్టి చూపించే హక్కు నీకు లేదు’ అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.