కొత్తవాళ్లకు పండగ.. హామీ మేరకు కాంగ్రెస్ టికెట్లు

తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అందుకు అవసరమైన కసరత్తుల్లో పార్టీ ముగినిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది.  ఇందులో చాలా వరకు కొత్తవాళ్ల పేర్లు ఉండటం విశేషం. ఈ సారి బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్, బీజేపీ నుంచి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. కీలక నాయకులకు, ఎన్నికల్లో ప్రభావం చూపగలరనుకునే నేతలకు టికెట్ల హామీనిచ్చి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తొలి జాబితా చూస్తే ఇచ్చిన హామీల మేరకు 12 నుంచి 13 మంది అభ్యర్థులకు తొలిసారి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంత రావు, మెదక్ నుంచి ఆయన తనయుడు రోహిత్ కాంగ్రెస్ జెండా మీద పోటీ చేయబోతున్నారు. అలాగే ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి (ఆర్మూర్), కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (నాగర్ కర్నూల్), కసిరెడ్డి నారాయణ రెడ్డి (కల్వకుర్తి), జూపల్లి క్రిష్ణారావు (కొల్లపూర్), వేముల వీరేశం (నకిరేకల్), జయవీర్ రెడ్డి (నాగార్జున సాగర్) కూడా కాంగ్రెస్ తరపున పోటీకి సై అంటున్నారు. ఈ సారి ఎన్నికలకు సీనియర్ నాయకుడు జానారెడ్డి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ టికట్ ఆయన చిన్న కొడుకు జయవీర్ రెడ్డికి దక్కడం గమనించాల్సిన విషయం.

ఇక జి.వినోద్ గత ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే కొక్కిరాల ప్రేమ్ సాగర్ (మంచిర్యాల), కోట నీలిమ (సనత్ నగర్), సునీల్ కుమార్ (బాల్కొండ), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి)కు కూడా కాంగ్రెస్ అవకాశమిచ్చింది. అయితే ఆయా నియోజకవర్గాల్లో కొత్తవాళ్లకు టికెట్లు ఇవ్వడంతో పాత కాంగ్రెస్ నాయకులు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. మైనంపల్లి, ఆయన కొడుకు రాకతో ఇప్పటికే మెదక్, మేడ్చల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు తొలి జాబితా వెలువడటంతో ఇంకెంత మంది పార్టీని వీడతారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.