మేనిఫెస్టో..జగన్ ను కాపీ కొట్టిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలన్నర గడువు మాత్రమే ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించగా…బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉంది. ఇక, ఆల్రెడీ నెలన్నర క్రితమే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కేసీీఆర్..తాజాగా ఈ రోజు మేనిఫెస్టోను ప్రకటించారు. మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ఏపీ సీఎం జగన్ నుంచి కేసీఆర్ కాపీ కొట్టినట్లు కనిపించింది.

సామాజిక పెన్షన్ స్కీమ్ ను జగన్ ను చూసి పెట్టానని స్వయంగా కేసీఆర్ అన్నారు. ఏడాదికి 500 రూపాయల చొప్పున పెన్షన్ పెంచుకుంటూ పోతూ ఐదు వేల రూపాయలు చేస్తానని కేసీఆర్…జగన్ మాదిరి హామీనిచ్చారు. ఇక, తెల్ల రేషన్ కార్డు వారికి సన్న బియ్యం సరఫరా కూడా ఏపీ నుంచి కాపీ కొట్టింది. జగనన్న కాలనీలలో ఇళ్ల స్థలాల ఫార్మాట్ ను కూడా కేసీఆర్ కాపీ కొట్టారు. ఇక, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు పోటీ ఇచ్చేలా మేనిఫెస్టోలో కొన్ని అంశాలున్నాయి. బీఆర్ఎస్ స్కీములు ఆషామాషీవి కావని, దేశానికే ఆదర్శప్రాయంగా ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

‘సౌభాగ్య లక్ష్మి’ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం…93 లక్షల కుటుంబాలకు లబ్ది
రూ.5 లక్షలతో బీమా సౌకర్యం… ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాట్లు
సాధారణ మరణానికి కూడా కేసీఆర్ బీమా వర్తింపు
తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం… ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్నబియ్యం సరఫరా
ఆసరా పింఛన్ల మొత్తం దశలవారీగా పెంపు
పింఛన్లు ఏడాదికి రూ.500 చొప్పున రూ.5 వేల వరకు పెంపు
రైతు బంధు మొత్తం దశలవారీగా రూ.16 వేల వరకు పెంపు… ముందుగా రూ.12 వేలకు పెంపు
అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్
జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు
ఆరోగ్యశ్రీ బీమా మొత్తం రూ.15 లక్షలకు పెంపు
దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు
పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్
హైదరాబాదులో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
అనాథ బాలల కోసం పటిష్టమైన అర్బన్ పాలసీ
అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేత
ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు
అసైన్డ్ భూముల సొంతదారులకు పట్టా హక్కులు
ఓపీఎస్ డిమాండ్ పై ఉన్నతాధికారులతో కమిటీ