టిక్కెట్లు రాని వారికోసం పోరాడ‌తా: కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌క‌టించిన తొలి జాబితాలో కోమ‌టి రెడ్డికి పార్టీ సీటు ప్ర‌క‌టించింది. అయితే.. కొంద‌రు ఆశావ‌హులు, ముఖ్యంగా కీల‌క నేత‌ల వార‌సుల‌కు పార్టీ టికెట్లు ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టిక్కెట్లు రాని వారి త‌ర‌ఫున తాను అధిష్టానం వ‌ద్ద పోరాటం చేస్తాన‌న్నారు.

బీసీల విష‌యంలో బీఆర్ ఎస్ పార్టీ క‌న్నా కాంగ్రెస్ మంచిగానే వ్య‌వ‌హ‌రించిన‌ట్టు కోమ‌టిరెడ్డి చెప్పారు. తాజాగా ప్ర‌క‌టించిన 55 సీట్లలో బీసీలకు 12, జనరల్ 26, మైనారిటీలకు 3 సీట్లు ఉన్నాయని తెలిపారు. బీసీలకు 12 సీట్లు ఇచ్చార‌ని వ‌చ్చే రోజుల్లో మ‌రింత మందికి అవ‌కాశం ద‌క్కుతుంద‌న్నారు. బీఆర్ ఎస్ పార్టీ క‌న్నా బీసీల‌కు కాంగ్రెస్ ఎక్కువ టికెట్లు ఇచ్చింద‌ని తెలిపారు. టికెట్స్ రానివారు నిరాశ చెందవద్దని, అందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని అన్నారు.

అసంతృప్తుల విష‌యంపై తాను పోరాటం చేస్తాన‌ని, వారికి న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. టిక్కెట్లు దక్కనివారికి ఇతర పదవులు వస్తాయన్నారు. మ‌లి జాబితాలో కూడా సామాజిక సమీకరణాలకే పెద్ద‌పీట వేయ‌నున్న‌ట్టు చెప్పారు.

అయితే, పొత్తుల‌పైనా కోమటిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వామ‌ప‌క్ష పార్టీల‌తో పొత్తు కారణంగా కాంగ్రెస్‌కు న‌ష్ట‌మేన‌ని చెప్పారు. సీపీఎం నాయ‌కులు మిర్యాలగూడ టికెట్ కోరుతున్నార‌ని, కానీ, ఇది కాంగ్రెస్‌కు కంచుకోట అని చెప్పారు. మునుగోడు సీటు తీసుకోమంటే కొత్తగూడెం కావాలంటున్నారని, ఇది కూడా పార్టీకి ఇబ్బందేన‌న్నారు. రాష్ట్రంలో ఏర్ప‌డేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌న్నారు. 70 సీట్లు ఖాయంగా గెలుచుకుంటామ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.