కోర్టు ఆదేశిస్తే.. చంద్ర‌బాబు గ‌దిలో ఏసీ పెడ‌తాం: డీఐజీ

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ఆరోగ్యం విష‌యంలో వ‌స్తున్న సంచ‌ల‌న వార్త‌ల నేప‌థ్యంలో ఇటు ప్ర‌భుత్వ వైద్యులు, అటు జైళ్ల శాఖ డీఐజీ ర‌వికిర‌ణ్ కూడా స్పందించారు. హుటాహుటిన మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి.. చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రిస్తితిని వారు వివ‌రించారు. తొలుత వైద్యులు మాట్లాడుతు.. చంద్ర‌బాబు ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌న్నారు. అయితే, ఆయ‌నకు గ‌తంలో ఎలాంటి జ‌బ్బులు ఉన్నాయో త‌మ‌కు తెలియ‌ద‌ని, ప్ర‌స్తుతం డీహైడ్రేష‌న్‌కు గుర‌య్యార‌ని.. వెంట‌నే త‌గిన వైద్యం అందించామ‌ని తెలిపారు.

డీహైడ్రేష‌న్ నేప‌థ్యంలో ఆయ‌న‌ను చ‌ల్లని వాతావ‌ర‌ణంలో ఉంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తాము సూచించిన‌ట్టు తెలిపారు. చంద్ర‌బాబుకు స్టెరాయిడ్స్ ఇస్తున్నామ‌న్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని, ఎలాంటి స్టెరాయిడ్లు ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. చంద్ర‌బాబు నిత్యం వాడే మందుల‌ను తాము కూడా ప‌రిశీలించామ‌ని, అవి చూశాకే మిగిలిన మందులు సూచించామ‌న్నారు. చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని చెప్పారు. చంద్ర‌బాబు ఆరోగ్యంవిష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి ఆందోళ‌నా అవ‌స‌రం లేద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా డీఐజీ ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ఆరోగ్యంపై ప్ర‌భుత్వ వైద్యులు ఇస్తున్న నివేదిక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కోర్టుకు అందిస్తున్నామ‌న్నారు. తాజా నివేదిక‌ను కూడా కోర్టుకు స‌మ‌ర్పిస్తామ‌ని చెప్పారు. జైల్లో ఏసీ ఏర్పాటు చేసే నిబంధ‌న‌లు లేవ‌ని, అయితే, ప్ర‌త్యేక ప‌రిస్థితిలో కోర్టులు ఆదేశిస్తే.. ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. చంద్ర‌బాబు కుటుంబం ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని, తాము ఎవ‌రి విష‌యంలోనూ దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌బోమ‌న్నారు. అయితే, ములాఖ‌త్ స‌మ‌యం ముగిసింద‌ని చెప్ప‌డం త‌మ విధుల్లో భాగ‌మ‌ని డీఐజీ పేర్కొన్నారు.

చంద్ర‌బాబు వంటి హైప్రొఫెల్ వ్య‌క్తి విష‌యంలో అన్ని నిబంధ‌న‌లు పాటిస్తూ.. జాగ్ర‌త్త‌గా ఉంటామ‌ని డీఐజీ ర‌వికిర‌ణ్ చెప్పారు. చంద్ర‌బాబు ఆహార‌పు అల‌వాట్లు ఏమిటో వైద్యులు తెలుసుకున్నార‌ని, ప‌ర్స‌న‌ల్ డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కే తాను మందులు వాడ‌తాన‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు తెలిపారు. చంద్ర‌బాబుకు ఇస్తున్న మందుల వివ‌రాల‌ను కూడా కోర్టుకు స‌మ‌ర్పిస్తామ‌న్నారు.