బీఆర్ఎస్ లోకి పొన్నాల..ప్రకటనే తరువాయి

కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు మరో నెలన్నర గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో పొన్నాల తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు షాకిచ్చింది. అయితే, తనకు టికెట్ రాదని తెలియడంతోనే పొన్నాల రాజీనామా చేశారని టాక్ వస్తోంది. ఇక, రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన పొన్నాల..పార్టీలో తనకు తగినంత గౌరవం దక్కడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అయితే, పొన్నాల బీఆర్ఎస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

దానికి తోడు, పొన్నాల పార్టీలోకి వస్తామంటే ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. పొన్నాల పార్టీలోకి వస్తానంటే నేనొద్దంటానా అంటూ మంత్రి కేటీఆర్ నిన్న చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. పొన్నాల కారు ఎక్కుతానంటే తానే డోర్ ఓపెన్ చేస్తాననే అర్థం వచ్చేలా కేటీఆర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా పొన్నాల ఇంటికి కేటీఆర్ స్వయంగా వెళ్లిన వైనం సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి కేటీఆర్ పొన్నాల నివాసానికి వెళ్లడం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.

పొన్నాల వస్తానంటే ఇంటికి వెళ్తానని కేటీఆర్ అన్నారని, ఇపుడు వెళ్లారు కాబట్టి పొన్నాల కారు ఎక్కబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ రాక నేపథ్యంలో పొన్నాల నివాసం దగ్గరకు ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. జనగామ గడ్డ… పొన్నాల అడ్డా అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్, పొన్నాలల మధ్య చర్చలు సఫలం అయితే రేపో మాపో పొన్నాల కారులో షికారు చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆ ఊహాగానాలకు తెరదించుతూ పొన్నాలతో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సూచన ప్రకారం పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించామని వెల్లడించారు. బీఆర్ఎస్ లోకి వస్తే పొన్నాలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని, సీనియారిటీకి గౌరవం ఇస్తామని అన్నారు. జనగామలో జరిగే బీఆర్ఎస్ సభ వేదికగా పార్టీలో చేరాలని పొన్నాలను కోరామని, కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని పొన్నాల అన్నారని కేటీఆర్ చెప్పారు. పార్టీలో చేరేందుకు పొన్నాల సానుకూలంగా స్పందించారని, కేసీఆర్ ను ఆదివారం కలుస్తారని వెల్లడించారు.