భ‌యంక‌ర ప‌రిస్థితిలో చంద్ర‌బాబు : నారా లోకేష్‌

రాజమండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు భ‌యంక‌ర ప‌రిస్థితిలో ఉన్నార‌ని ఆయ‌న కుమారుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు. క‌లుషిత నీరు, దోమ‌లు, వెంటిలేష‌న్ లేక‌పోవ‌డం వంటి కార‌ణంగా చంద్ర‌బాబు అనారోగ్యానికి గుర‌య్యార‌ని తెలిపారు. చంద్ర‌బాబు ఆరోగ్యం ప‌ట్ల త‌మ కుటుంబం ఆందోళ‌న‌గా ఉంద‌న్నారు. కుట్ర పూరితంగానే చంద్ర‌బాబును జైల్లో నిర్బంధించార‌ని విమ‌ర్శించారు.

ప్ర‌భుత్వ వైద్యులు, ప్ర‌భుత్వం కూడా చంద్ర‌బాబు ఆరోగ్యం విష‌యంలో వాస్త‌వాల‌ను దాస్తున్నార‌ని లోకేష్ ఆరోపించారు. చంద్ర‌బాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. చంద్ర‌బాబుకు ఏం జ‌రిగినా సీఎం జ‌గ‌న్ దే బాధ్య‌త‌ని తేల్చి చెప్పారు. ఈ మేర‌కు నారా లోకేష్ ట్వీట్‌(ఎక్స్‌) చేశారు. ఇదిలావుంటే, చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రిస్థితిపై ఆయ‌న స‌తీమ‌ణి, కుమారుడు, కోడ‌లు కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

త‌న భ‌ర్త ఆరోగ్యంపై త‌మ‌కు ఆందోళ‌న‌గా ఉంద‌ని చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. ఇన్‌ఫెక్ష‌న్‌, అల‌ర్జీతో చంద్ర‌బాబు బాధ‌ప‌డుతున్నార‌ని, అప‌రిశుభ్ర జైలులో నిర్బంధించ‌డం హృద‌య విదార‌మ‌ని అన్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి కూడా బాబు ఆరోగ్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బాబు ఆరోగ్యంపై కుటుంబ‌మంతా తీవ్ర ఆందోళ‌న‌తో ఉంద‌ని తెలిపారు. ఇదిలావుంటే, రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు వ‌ద్ద టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఈ రోజు(శుక్ర‌వారం) జైల్ భ‌రో కార్య‌క్రమాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప‌లువురు నాయ‌కుల‌ను అరెస్టు చేశారు.