‘ఏం పీకుతాడంటే.. రెండు పీకి సెంట్ర‌ల్ జైల్లో పెట్టాం’

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విష‌యం తెలిసిందే. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో 341 కోట్ల రూపాయల అవినీతికి పాల్ప‌డ్డారంటూ ఆయ‌న‌ను ఏపీ సీఐడీ జైలుకు పంపించింది. అయితే.. ఇదంతా రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మేన‌ని టీడీపీ నేత‌లు అనేక రూపాల్లో ఆందోళ‌న నిర్వ‌హిస్తూనే ఉన్నారు. కానీ, అధికార పార్టీ వైసీపీ మాత్రం అదేం లేదు.. అస‌లు కుట్ర అనే మాటే లేద‌ని ఇప్ప‌టివ‌ర‌కు చెబుతూ వ‌చ్చింది.

కానీ, తాజాగా చంద్ర‌బాబు అరెస్టు, జైలుపై మంత్రి అంబ‌టి రాంబాబు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఈ కుట్ర‌ను నిజ‌మ‌ని అనుకునేలా చేయ‌డం గ‌మ‌నార్హం. పైకి క‌క్ష సాధింపు లేదంటూనే.. “ఏం పీకుతాడు.. ఏం పీకుతాడు.. అని జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై మాట‌ల తూటాలు పేల్చారు. ఇప్పుడు రెండు పీకి సెంట్ర‌ల్ జైల్లో పెట్టాం. రాజ‌శేఖ‌ర‌రెడ్డే న‌న్నేం పీక‌లేక‌పోయాడు. జ‌గ‌నేం పీకుతాడ‌ని చంద్ర‌బాబు అన్నాడు. అందుకే రెండు పీకి జైల్లో పెట్టాం. నోరు పారేసుకుంటే ఇలానే ఉంటుంది. ఒళ్లు జాగ్ర‌త్త‌గా పెట్టుకుంటే మంచిది” అని అంబ‌టి వ్యాఖ్యానించారు.

‘‘చంద్ర‌బాబు, నారా లోకేష్‌ ఇద్దరూ వేలకోట్లు దోచుకున్నారు. ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటి?. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్‌ చేశారు. టీడీపీ నాశనం అవ్వడానికి కారణం లోకేషే. టీడీపీ నేతలు ఇప్పటికైనా గమనించాలి. నోరు పారేసుకోకుండా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ బలం ఉందని టీడీపీకి మద్దతిస్తాడు. టీడీపీని కాపాడటం ఎవరి వల్లా కాదు’’ అని అంబ‌టి చెప్పుకొచ్చారు.

కాగా, ఈ నెల 26 నుంచి వైసీపీ నేత‌లు బస్సు యాత్ర చేస్తున్న‌ట్టు అంబటి రాంబాబు తెలిపారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని.. 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.