కాంగ్రెస్ కు బూస్ట్ ఇస్తున్న సర్వే… కానీ !!

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కసారిగా హీట్ మొదలైపోయింది. తెలంగాణా, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోను చాలాచోట్ల బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు సాగబోతోంది. అందుకనే మీడియా సంస్ధలు సర్వేల పేరుతో దూకుడు పెంచేశాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పై చేయి సాధిస్తుందనే విషయంలో వరుసబెట్టి సర్వేలు చేస్తున్నాయి. ప్రీపోల్ సర్వేలన్ని కొన్నిసార్లు నిజాలవుతాయి, మరికొన్ని సార్లు తప్పుతాయి.

అయితే ఈ సర్వేలను ప్రామాణికంగా తీసుకోకుండా జనాల నాడిని తెలుసుకోవటానికి మాత్రం పార్టీలు ఉపయోగించుకుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏబీపీ-సీ ఓటర్ రిలీజ్ చేసిన తాజా సర్వే రిపోర్టు వైరల్ అయ్యింది. ఈ రిపోర్టు ప్రకారం మొత్తం ఐదు రాష్ట్రాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందట. ఇక బీజేపీ ఒక్క రాష్ట్రంలో మాత్రమే గెలుస్తుందట. మిగిలిన రెండు చోట్ల హోరా హోరీ లేదా బీజేపీ వెనకబడిపోతుందని సర్వేలో తేలింది.

230 సీట్లున్న మధ్యప్రదేశ్ లో అధికార బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతోందని తేలింది. అయినా 125 సీట్లతో కాంగ్రెస్సే అంతిమ విజయం దక్కించుకుంటుందని సర్వేలో తేలింది. ఓటు షేర్ రెండుపార్టీలకు చెరో 45 శాతం దక్కించుకుంటాయని తేలటం ఆశ్చర్యంగా ఉంది. 116 సీట్లతో బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంటుందట. ఇక 200 సీట్లున్న రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ ఓటమి తప్పదని తేలింది. 137 సీట్లతో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ లోని అంతఃకలహాలతో జనాలు విసిగిపోయినట్లు సర్వేలో బయటపడింది.

తెలంగాణాలో అధికార బీఆర్ఎస్-ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్యే పోటీ. బీజేపీ మూడోప్లేసుకే పరిమితం అవుతుందని తేలింది. కాంగ్రెస్ 48-60 సీట్లు, బీఆర్ఎస్ 43-55 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశముందట. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పేడు చెప్పలేమని సర్వే చెప్పింది. 90 సీట్లున్న చత్తీస్ ఘడ్ లో అధికార కాంగ్రెస్సే కంటిన్యు అవుతుందని తేలింది. ఫైనల్ గా 40 సీట్ల మిజోరంలో మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) దే అధికారం అని తేలింది. ఎంఎన్ఎఫ్ కు 13-17 సీట్లు వస్తే, కాంగ్రెస్ కు 10-14 సీట్లొస్తాయని తేలింది. ఇక్కడసలు బీజేపీ లేనేలేదు.