తాడో పేడో : విలీనానికి నో చెప్పేసిన షర్మిల

కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయటానికి వైఎస్ షర్మిల నో చెప్పేశారట. ఈ విషయాన్ని పార్టీ నేతలు చెప్పారు. విలీనం కోసం కాంగ్రెస్ అధిష్టానం విధించిన షరతులు షర్మిలకు ఆమోదయోగ్యంగా లేదట. అందుకనే విలీనం ప్రక్రియకు షర్మిల బ్రేకులు వేసేశారట. ఇందులో భాగంగానే ఈరోజు పార్టీ ఆపీసులో ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లోను పోటీ చేయాలని కూడా షర్మిల శుక్రవారం కోటరీ సమావేశంలో చెప్పారట.

ఆ నిర్ణయాన్నే శనివారం జరగబోయే ముఖ్య నేతల సమావేశంలో చర్చించి తీర్మానం చేయబోతున్నారు. జిల్లాల కన్వీనర్లకు, నియోజకవర్గాల కన్వీనర్లకు కూడా ఈ సమాచారాన్ని ఇప్పటికే షర్మిల పంపినట్లు తెలుస్తోంది. ఆసక్తి ఉన్న నేతల నుండి పోటీకి దరఖాస్తులు తీసుకోవాలని కూడా డిసైడ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే లేదా 9, 10 తేదీల్లో బీఫారాలు అందించాలని కూడా షర్మిల అనుకున్నారట.

మొదటి నుండి వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి సీనియర్ నేతలు కొండా రాఘవరెడ్డి, గట్టు రామచంద్రరావు, ఏపూరి సోమన్న తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎంతమంది వ్యతిరేకించినా షర్మిల మాత్రం ముందుకెళిపోయారు. అందుకనే కొండా, గట్టు, ఏపూరి పార్టీకి రాజీనామాలు చేశారు. దాదాపు మూడునెలలుగా పొత్తా ? విలీనమా ? అనే విషయం రెండుపార్టీల మధ్య నానుతున్న విషయం తెలిసిందే. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో జరిగిన భేటీలో చివరకు విలీనంకు షర్మిల అంగీకరించారు.

ఆ తర్వాతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక తో కలిసి షర్మిల బ్రేక్ పాస్ట్ కూడా చేశారు. అధిష్టానమేమో షర్మిలకు ఏపీ పార్టీపగ్గాలు అప్పగించాలని అనుకున్నది. అయితే అందుకు షర్మిల అంగీకరించలేదు. తాను తెలంగాణాలోనే కంటిన్యు అవుతానని చెప్పారు. దీనికి తెలంగాణా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో తీవ్రంగా వ్యతిరేకించారు. మొత్తానికి విలీనం ఆగిపోవటంతో ఖమ్మం జిల్లాలోని పాలేరు నుండి బరిలోకి దిగాలని షర్మిల డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం.