‘కాంతితో క్రాంతి’కి లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి పిలుపు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు రాజమండ్రిలో చంద్రబాబుతో లోకేష్ మధ్యాహ్నం మూడు గంటలకు ములాఖత్ కాబోతున్నారు. నారా భువనేశ్వరితో పాటు బ్రాహ్మణితో కలిసి చంద్రబాబుతో లోకేష్ భేటీ కాబోతున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి రాజమండ్రికి లోకేష్ బయలుదేరారు. ఈ సందర్భంగా అడుగడుగునా లోకేష్ కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

అయితే, లోకేష్ వెంట రాజమండ్రి వెళ్లేందుకు కొంతమంది టిడిపి నేతలు ప్రయత్నించారు. కానీ, వారికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే టిడిపి నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. టోల్ గేట్ల దగ్గర లారీలు పెట్టి మరీ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఇక, రాజమండ్రి క్యాంపు సైటు దగ్గరకు కూడా కొంతమందినే పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో, రాజమండ్రి జైలు, లోకేష్ క్యాంపు సైటు దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

మరోవైపు, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమానికి లోకేష్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్, వాహనాల లైట్లు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని లోకేష్ పిలుపునిచ్చారు. బాబుతో నేను అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని, వీధుల్లోకి వచ్చి కొవ్వొత్తులు మొబైల్ టార్చితో వెలుగులు చూపించాలని లోకేష్ అన్నారు. వెలుగులు పంచే చంద్రుడిని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో బంధించారని లోకేష్ మండిపడ్డారు.

ఇక, రాష్ట్రంలో అన్యాయం, అధర్మం రాజ్యమేలుతున్నాయని, ఇవి చీకటికి సంకేతాలని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలోని చీకటిని సూచిస్తుందని చెప్పారు. ఆ చీకటిని తరిమికొట్టాలని కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిచ్చామని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

‘‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి… దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి? తెలుగుదేశం పార్టీ “కాంతితో క్రాంతి” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దాం’’ అంటూ నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు.