పవన్ విషయంలో బీజేపీకి దిక్కుతోచటం లేదా ?

ఏపీ బీజేపీ నేతలకు దిక్కు తోస్తున్నట్టు లేదు. రాబోయే ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలా అన్న విషయం నేతలను పూర్తిగా అయోమయంలోకి నెట్టేస్తున్నట్లుంది. వారాహి యాత్రలో పెడనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాను ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో ముదినేపల్లిలో మాట్లాడుతూ తాను ఎన్డీయేలోనే ఉన్నట్లు చెప్పారు. నిజానికి ఎన్టీయేలో నుండి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని పవన్ వెయిట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు, రిమాండును అవకాశంగా తీసుకుని పవన్ ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేశారే అందరు అనుకున్నారు. దాంతో పవన్ ప్రకటనపై బీజేపీ నేతలు సమావేశమై భవిష్యత్ రాజకీయ కార్యాచరణ రెడీ చేయాలని అనుకున్నారు. అయితే మరుసటిరోజే పవన్ యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ముందు ముందు ఎన్డీయేలో నుండి పవన్ బయటకు వెళ్ళరినే గ్యారెంటీ అయితే లేదు.

అందుకనే అప్పుడు ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే బీజేపీకి సొంతబలమంటు ఏమీలేదు. పోయిన ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి పార్టీ తరపున గట్టి అభ్యర్ధులే దొరకలేదు. పోటీచేసిన నియోజకవర్గాల్లో ఒక్కళ్ళంటే ఒక్క అభ్యర్ధికి కూడా డిపాజిట్ కూడా దక్కలేదు. పోయిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 0.56. నోటాకి వచ్చిన ఓట్ల శాతం సుమారు 3. అంటే నోటా కన్నా బీజేపీ తీసి పోయినట్లు అర్ధమవుతోంది.

పోనీ ఈ ఐదేళ్ళల్లో పార్టీ ఏమైనా బలపడిందా అంటే అదీ లేదు. నరేంద్ర మోదీ పాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న కారణంగా మోడీ ప్రభుత్వం అంటేనే జనాలు మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే జనసేనను పట్టుకుని పది ఓట్లు తెచ్చుకోవాలని కమలనాథులు అనుకున్నారు. కానీ అది జరిగేంతవరక అనుమానమే. జనసేనతో కలిసుండాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరిలాగ తయారైంది. ఒకవేళ జనసేన విడిపోతే అప్పుడు పార్టీ పరిస్ధితి ఏమిటనేది తలచుకోవటానికి పార్టీ నేతలకు ఇబ్బందిగా ఉంటుంది.అందుకనే రాష్ట్ర రాజకీయ పరిణామాల విషయంలో బీజేపీ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది.