కాంగ్రెస్ కు ఊపునిచ్చిన సర్వే ?

తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపే వార్తనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మొట్టమొదటి సర్వే రిపోర్టు విడుదలైంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్ది అండ్ కో చెప్పుకుంటున్నారు. ఎలాగు పార్టీ నేతలే కాబట్టి కచ్చితంగా అధికారంలోకి వస్తామనే చెబుతారు. ఇప్పటివరకు జరిగిన చాలా సర్వేల్లో కాంగ్రెస్ రెండో స్ధానంలోనే ఉంటుందని, కాకపోతే గ్రాఫ్ పెంచుకుంటోందని తెలిసింది.

వివిధ కారణాలతో కాంగ్రెస్ గ్రాఫ్ స్ధిరంగా పెరుగుతోందన్న విషయమైతే అర్ధమవుతోంది. అలాంటిది మొదటిసారిగా ‘లోక్ పోల్’ నిర్వహించిన లేటెస్టు సర్వేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కాని తేలింది. ఇదే లోక్ పాల్ కర్నాటక ఎన్నికల్లో చెప్పిన సర్వే ఫలితం నూరుశాతం నిజమైంది కాబట్టి తెలంగాణాలో కూడా అధికారంలోకి రావటం గ్యారెంటీ అని హస్తం పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇంతకీ సర్వేలో ఏమి తేలిందంటే 41-44 శాతం ఓటు షేరుతో 61-67 సీట్ల మధ్య గెలుచుకుంటుందని తేలిందట.

ఇక అధికార బీఆర్ఎస్ 39-42 శాతం ఓట్ల షేరుతో 45-51 మధ్య సీట్లకే పరిమితమవుతుందట. 3-4 శాతం ఓట్లషేరుతో ఎంఐఎం 6-8 సీట్లు గెలుచుకుంటుందని తేలిందట. ఎంఐఎం ఓల్డ్ సిటి అడ్డాగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఎంఐఎంకు బాగా బలమైన ఓల్డ్ సిటీలో కూడా పాగా వేయాలని కాంగ్రెస్ అనుకుంటున్నది. అందుకనే అభ్యర్ధుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నది.

ఇక 10-12 శాతం ఓట్ల షేరుతో బీజేపీ 2 లేదా 3 సీట్లకే పరిమితమవుతుందని తేలింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మ్యాగ్జిమమ్ 3 శాతం ఓట్లు తెచ్చుకుంటుంది అనుకుంటున్న ఎంఐఎం 6-8 సీట్ల మధ్య గెలుచుకుంటుందని తేలటం. అలాగే సగటున 11 శాతం ఓట్ షేర్ సాధిస్తుందని అనుకుంటున్న బీజేపీ మ్యాగ్జిమమ్ 3 సీట్లకే పరిమితమవుతుందని తేలటం. ఇక 3 నుండి 5 శాతం ఓట్లషేరుతో ఇతరులు ఒక్క సీటులో గెలిచే అవకాశముందని తేలిందట. పథకాలు సక్రమంగా అమలు కాకపోవటం, కేసీయార్ వైఖరి, కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్ లాంటి అనేక కారణాలతో కాంగ్రెస్ వైపు జనాలు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో బయటపడిందట.