బ్రేకింగ్: రాజ‌య్య‌, నందికంటిల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట నిల‌బెట్టుకున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో భాగంగా టికెట్ల కేటాయింపులో నెల‌కొన్ని అసంతృప్తికి చెక్ పెట్టే క్ర‌మంలో ప‌లువురు నేత‌ల‌కు కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వ‌నున్న‌ట్లు హామీ ఇచ్చిన గులాబీ ద‌ళ‌ప‌తి ఈ మేర‌కు నేడు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఇలా నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన వారిలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నారు. వీరితో పాటుగా ఇటీవ‌లే పార్టీలో చేరిన మ‌ల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు నందికంటి శ్రీ‌ధ‌ర్‌, మ‌రోనేత ఉప్ప‌ల వెంక‌టేష్ ఉన్నారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని TSRTC చైర్మన్‌గా నియ‌మించారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యను నియమించారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో… ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీఆర్ఎస్‌లో చేరిన బీసీ నేత నందికంటి శ్రీ‌ధ‌ర్‌కు ఎంబీసీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి కేటాయించారు. మిష‌న్ భ‌గీర‌థ చైర్మ‌న్‌గా ఉప్ప‌ల వెంక‌టేష్‌ను నియ‌మించారు.

రాబోయే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ క‌ద‌న రంగంలో దూక‌గా ఈ టికెట్ల కేటాయింపుపై ప‌లువురు నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అలా ప్ర‌క‌టించిన వారిలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యను ఉన్నారు. దీంతో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అసంతృప్త నేతలతో మాట్లాడి.. వారి డిమాండ్లను నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యతో మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ ఇవ్వలేక‌పోతున్నామ‌ని ప్రత్యామ్నాయంగా గౌరవ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేర‌కు ఇచ్చిన హామీల‌ను నిలుపుకొంటూ తాజాగా వారి నియామ‌కాల ఆదేశాలు వెలువ‌రించారు.