ఎన్డీఏలోనే ఉన్నాం: పవన్

ఎన్టీఏకు ఒక అడుగు దూరం జరిగానని పెడన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలను ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్డీఏతో పవన్ తెగదెంపులు చేసుకున్నట్లేనని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కైకలూరు లోని ముదినేపల్లి లో జరిగిన బహిరంగ సభలో ఎన్డీఏలో జనసేన పొత్తు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీఏ కూటమి నుంచి జనసేన బయటకు వచ్చేసిందని కొందరు సలహాదారులు తన వీడియోలు చూపించి మరీ విమర్శిస్తున్నారని పరోక్షంగా సజ్జలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్డీఏలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి..వైసీపీకి సమస్య ఏంటి అని పవన్ ప్రశ్నించారు. 151 సీట్లు ఉండి కూడా జనసేనను చూసి వైసీపీ భయపడుతోందంటే ఓటమి భయం పట్టుకున్నట్లేనని పవన్ వ్యాఖ్యానించారు. తనకే 151 సీట్లు ఉంటే ప్రతిపక్షాలను అసలు పట్టించుకోనని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటకు రావాలనుకుంటే ఆ విషయం తానే ప్రకటిస్తానని పవన్ అన్నారు. మేము బయటకు వచ్చామని వైసీపీ నేతలు చెబితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్డీఏతో జనసేన కలిసి ఉందని సభాముఖంగా పవన్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా అంటే గౌరవం ఉందని, రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి ముందుకు వెళ్తామని తాను అనుకుంటున్నానని పవన్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిచి జనసేనకు కేంద్రం మద్దతు లేకపోతే నీ అంతు చూస్తాం అని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని పవన్ ఆరోపించారు, వైఎస్ ను తాను ఎదుర్కొన్నానని, జగన్ ఉడత ఊపులకు భయపడే వాడిని కాదని చెప్పారు. 2014లో వైసీపీ ఓడిపోయిన తర్వాత తన ఆఫీసు దగ్గరకు వైసీపీ రౌడీలు వచ్చారని, ఒకవేళ కేంద్రంలో బీజేపీ… ఏపీలో టీడీపీ 2014లో ఓడిపోయి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఉండదని, రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు.