ఐ డోంట్ కేర్..జూ.ఎన్టీఆర్ పై బాలకృష్ణ కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తారక్ తో పాటు ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్యను మీడియా ప్రతినిధులు అడిగారు. దీంతో, బ్రో..ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య జవాబిచ్చారు.

చంద్రబాబు అరెస్టు గురించి సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని అన్నారు. రోజా లాంటి వారి స్పందనపై మౌనంగా ఉండటమే మేలని, బురదమీద రాయి వేస్తే మనమీదే పడుతుందని చెప్పారు. అయితే, తన అక్క పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని, చంద్రబాబు అరెస్టుపై తప్పకుండా కేంద్రాన్ని కలుస్తామని చెప్పారు. తాము కేసులకు, అరెస్టులకు భయపడబోమని, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కొందరు ఎన్టీఆర్‌ జపం మొదలుపెట్టారని బీఆర్‌ఎస్ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో గత 3 రోజుల నుంచి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారని, కేవలం ఓట్ల కోసం బీఆర్‌ఎస్ నేతలు స్పందిస్తున్నారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కాదని, తెలుగు వారి గౌరవం కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు.

ఏపీలో సైకో పాలన నడుస్తోందని, ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని, అనవసరంగా నిందలు వేయమని చెప్పారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం కల్పించుకోవాల్సిన అవసరం ఉందని, లేదంటే వారి విజ్ఞతకే వదిలేయాలని అన్నారు.