కేసుల సంఖ్యలో ఆ 19 రాష్ట్రాలను బీట్ చేసిన తూ.గో జిల్లా

East Godavari

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు దాదాపు 6-8 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడచిన 24 గంటల్లో ఏపీలో మరో 8,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా….మొత్తం కేసుల సంఖ్య 3,61,712కి చేరింది. గత 24 గంటల్లో 86 మంది మరణించగా…కరోనాతో ఇప్పటివరకు 3,368 మంది మరణించారు.

ఇక, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. గడచిన 24 గంటల్లో 1441 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 50,686కు చేరుకుంది. ఈ ఒక్క జిల్లాలోనే 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా…కరోనా బారిన పడి 335 మంది మరణించడంతో ఆ జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు.

అయితే, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 50 వేలకు లోపే ఉన్నప్పటికీ…ఏపీలోని ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 50 వేలకు పైగా కేసులు నమోదవడం కలవరపెడుతోంది. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్ గఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, ఝార్ఖండ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలి-డమన్ అండ్ డయ్యూ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటలేదు. వీటిలో చాలా రాష్ట్రాలలో కేసుల సంఖ్య 10వేలకు లోపే ఉండడం విశేషం.

అయితే, తూ.గో జిల్లాలో కరోనా కేసుల తీవ్రతకు ప్రజల నిర్లక్ష్యం కారణమా…లేక ప్రభుత్వ వైఫల్యమా అన్నదానిపై చర్చ జరుగుతోంది. తూ.గో జిల్లాతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కేసుల సంఖ్య 30వేలకు పైగా నమోదు కావడం కూడా కలవరపెడుతోంది.

రాష్ట్రాలనే కాదు, అనేక దేశాలను తూగో జిల్లా దాటేసింది… మనందరికీ బాగా తెలిసిన ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియా, అల్జీరియా, యెమెన్, మలేషియా వంటి అనేక ప్రముఖ దేశాలతో పాటు వంద దేశాల కంటే కూడా తూర్పుగోదావరి జిల్లా కరోనా కేసుల్లో ముందంజలో ఉంది.