అంగళ్లు కేసులో టీడీపీకి ఊరట

అంగళ్లు అల్లర్ల కేసులో సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు…హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆ బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తీర్పును కొనసాగించాలని తేల్చి చెప్పింది. అయితే, ఈ కేసులో ఒక పోలీసు అధికారి గాయపడ్డారని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కానీ, ఆ వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. ఈ దశలో ఈ కేసు విచారణలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పింది.

దీంతో, అంగళ్లు కేసులో దేవినేని ఉమా, చల్లా బాబు, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలతో సహా దాదాపు 41 మందికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ కొనసాగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కూడా ఈ రోజు ఇదే బెంచ్ విచారణ జరపనుంది. మరోవైపు, అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. నారాయణ ముందస్తు బెయిల్ ను హైకోర్టు మరో 2 వారాల పాటు పొడిగించింది.

నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబి, నారాయణ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ 2 వారాల పాటు ముందస్తు బెయిల్ ను కోర్టు పొడిగించింది.