పవన్‌తో టీడీపీ నేతలు.. వాట్ ఏ కాంబినేషన్

2019 ఎన్నికలలో ఏపీలో ఎవరి దారిన వారు సాగిపోయారు. జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ దెబ్బకు వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కానీ, నాలుగేళ్లు తిరిగేసరికి మొత్తం మారిపోయింది. పాలక వైసీపీ విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకుంది. విపక్ష నేత చంద్రబాబును జైల్లో పెట్టి మరింత అపఖ్యాతి పాలైంది. పొత్తుల్లేకుండా కేవలం సానుకూల వైఖరితో మాత్రమే ఉన్న జనసేన, టీడీపీ అధినేతలకు రాజకీయ సంబంధాలు అంటగట్టి చివరికి వారిద్దరూ పొత్తు పెట్టుకునే వరకు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ పొత్తే ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన వైసీపీని అయిదేళ్లకే ఇంటికి పంపనుంది. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలు కలిసి మెలసి తిరుగుతూ జనంలోకి వెళ్లడం ఇప్పటికే మొదలైపోయింది. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా టీడీపీ, జనసేన మధ్య పొరపొచ్చాలనేవి మచ్చుకు కూడా కనిపించకపోవడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

తాజాగా పవన్ కల్యాణ్ తన యాత్ర పున:ప్రారంభించిన మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతలంతా వెళ్లి పవన్‌ను కలిశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ఇంఛార్జులు, సీనియర్ నాయకులు సోమవారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా మచిలీపట్నంలో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అది పూర్తయిన వెంటనే తెలుగుదేశం నేతల బృందం పవన్‌ను కలిసింది.

టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బొడే ప్రసాద్, కమ్మలి విఠల్ రావు, బూరగడ్డ వేదవ్యాస్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, రావి వేంకటేశ్వర రావు.. ఒకరేమిటి మచిలీపట్నం ప్రాంత టీడీపీ పెద్ద తలకాయలన్నీ కలిసి కట్టుగా వెళ్లి పవన్‌ను కలిశాయి. సొంత పార్టీ అధినేతతో భేటీ అయినట్లుగా టీడీపీ నేతలు తమ నేతను కలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన క్యాడర్ హ్యాపీగా ఫీలవుతోంది. తాము కూడా టీడీపీతో కలిసి పనిచేయాలని మరోసారి వారంతా డిసైడయ్యారు.

మరోవైపు పవన్ కల్యాణ్ కూడా తమ పార్టీ నేతలతో మాట్లాడినప్పుడు టీడీపీ విషయం స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ద్వారా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తామనే నమ్మకం ప్రజల్లోనూ కలిగిందని.. ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని పవన్ చెప్పారు. ‘జగన్ లాంటి వ్యక్తిని ధీటుగా ఎదుర్కొవాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కచ్చితంగా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దీనిని ప్రజలు కూడా ముక్త కంఠంతో ఆమోదిస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు ప్రజలు నిర్ణయించిన పొత్తు. వారు కోరుకున్న పొత్తు. రాజకీయాల్లో ప్రజల కోసం మాత్రమే పని చేయాలి. వారి ఉన్నతి కోసమే ఆలోచించాలి. వ్యక్తిగత లెక్కలు ఏమీ ఉండవు. జనసేన పార్టీ రోడ్ల మీద పోరాటం చేసే పార్టీగానే ఉండిపోకూడదు. రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయడం అవసరం. మన దగ్గర సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి పరిష్కారం చూపించే విధంగా మనం తయారవ్వాలి.

పొత్తు ధర్మం ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలి. పాత విషయాలను మనసులో పెట్టుకొని మనలో మనం గొడవలుపడితే కచ్చితంగా మళ్లి జగన్ అధికారంలోకి వస్తాడు. మన మధ్య లేనిపోని చిచ్చుపెట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. వారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. లోక కళ్యాణం కోసం గరళం కంఠంలో నింపుకున్న పరమశివుడిలా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర శ్రేయస్సు కోసం పరస్పరం సహకరించుకుంటూ పనిచేయాలి. నేను కూడా సభ వేదికలపై జనసేన – తెలుగుదేశం అని సంబోధిస్తాను. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ల వేదికలపై తెలుగుదేశం- జనసేన అని చెబుతారు. ఇరువురి గౌరవాలకు ఏ మాత్రం భంగం కలగకుండా పొత్తును ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని జనసేన కార్యకర్తలు తక్కువ అంచనా వేయకండి. వారి పార్టీ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటుంది. ఈ సమయంలో మిత్రధర్మం పాటిద్దాం. అలాగే పోరాటాలకు వేదిక అయిన జనసేన పార్టీని సైతం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సముచితంగా గౌరవించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ 2024 కోసం ఏం చేయాలో.. జగన్‌ను ఇంటికి ఎలా పంపించాలో జనసేన నేతలకు పవన్ చెప్పారు.