బ్రేకింగ్ః మైనంప‌ల్లి ఎఫెక్ట్‌తో నందికంటి రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయంగా రోజు రోజుకు ర‌స‌కందాయంలో ప‌డుతోంది. మ‌ల్కాజ్‌గిరి సిటింగ్ ఎమ్మెల్యే, ఇటీవ‌లే బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు కార‌ణంగా మ‌రో ముఖ్య‌నేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మొద‌టి నుంచి మైనంప‌ల్లి చేరికను వ్యతిరేకిస్తున్న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఈరోజు తన అనుచరులతో సమావేశం త‌ర్వాత నిర్ణ‌యం వెలువ‌రిస్తూ… ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు లేఖ రాశారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు లేఖ పంప‌డానికి ముందు నందికంటి శ్రీ‌ధ‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మౌలాలి క్లాసిక్‌ గార్డెన్ ఫంక్షన్‌ హాల్‌లో నందికంటి శ్రీధర్ సమావేశం నిర్వ‌హించ‌గా దాదాపు వేయి మంది ముఖ్య కార్యకర్తలు హాజరైనట్లు స‌మాచారం. మైనంపల్లి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇచ్చి బీసీకి అన్యాయం చేస్తున్నారని ఈ సమావేవానికి హాజరైన పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను తల్లిలా భావించిన కాంగ్రెస్ పార్టీనే తనను మోసం చేసిందని ఆయన కన్నీళ్లు పెట్టకున్నారు. బీసీలకు కాంగ్రెస్‌లో స్థానం లేదంటూ ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. పార్టీ తనకు ద్రోహం చేసిందని నందికంటి ఆగ్రహం చేసినట్లు స‌మాచారం. దీంతో పార్టీకి రాజీనామా చేద్దామని కార్యకర్తలు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. అనంత‌రం ఆయ‌న రాజీనామా చేశారు.

1994 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్న తాను మ‌ల్కాజ్‌గిరి నియోజకవర్గంలో పార్టీ బ‌లోపేతానికి ఎంతో కృషి చేశాన‌ని వెల్ల‌డించారు. మొదటి నుంచి పార్టీలో కష్టపడి పని చేసిన తన లాంటి వారికి గుర్తింపు లేక‌పోగా మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కు రెండు టికెట్లు ఇస్తూ తీసుకున్న నిర్ణ‌యం బాధించింద‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద‌య్‌పూర్ తీర్మానానికి వ్య‌తిరేకంగా మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం, బీసీనేత‌నైన త‌న‌ను కాంగ్రెస్ పార్టీ అణ‌గ‌క‌దొక్క‌డం తీవ్రంగా బాధించింద‌ని వాపోయారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీకి, జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు నందికంటి శ్రీ‌ధ‌ర్ లేఖ‌లో వెల్ల‌డించారు.

కాగా, మైనంప‌ల్లి రాకను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన రెండో ముఖ్య‌నేత నందికంటి శ్రీ‌ధ‌ర్‌. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి అధ్య‌క్షుడు, మ‌ల్కాజ్‌గిరి టికెట్ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన నందికంటి శ్రీ‌ధ‌ర్ సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే నందికంటి శ్రీ‌ధ‌ర్‌ బీఆర్ఎస్ లో చేరుతారా? లేదా బీజేపీ కండువా కప్పుంటారా? అన్నది రాజకీయ వర్గాల‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.