మైనంపల్లి రాక.. మెదక్ కాంగ్రెస్ లో కుంపటి

బీఆర్ఎస్ నుంచి రెండు టికెట్లు ఆశించి భంగపడ్డ మైనంపల్లి హన్మంతరావు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి తనకు మల్కాజిగిరి, తన తనయుడు రోహిత్ కు మెదక్ టికెట్లు ఇస్తామనే హామీతో మైనంపల్లి హస్తం గూటికి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు మెదక్ లో కాంగ్రెస్ లో ఇదే ఇప్పుడు కుంపటి రాజేసిందనే చెప్పాలి. తాజాగా కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. అంతే కాకుండా సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు సంచులు కలిగిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం కాంగ్రెస్ మోడల్ గా మారిందనే భావన ప్రజల్లోకి వెళ్తుందని తిరుపతి రెడ్డి వ్యాఖ్యానించారు.

మెదక్లో కాంగ్రెస్ పార్టీ కోసం కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పదేళ్లుగా కష్టపడుతున్నారు. ఆయన రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మెదక్ టికెట్ తనకే ఇస్తారని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు మైనంపల్లి పార్టీలో చేరడంతో తిరుపతి రెడ్డి ఆశలు కుప్పకూలాయి. మైనంపల్లి కొడుకు రోహిత్ కే కాంగ్రెస్ మెదక్ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో తిరుపతి రెడ్డి పార్టీని వదిలేయాలని నిర్ణయించుకున్నారు.

పార్టీ కోసం పని చేసిన వాళ్లకు గుర్తింపు దక్కడం లేదనే వేదనతో తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ లో స్థానం లేదనే విషయం ఇటీవలి పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోందని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పని చేసిన వాళ్లకు ఇప్పుడు పిలిచి మరీ టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం డబ్బు సంచులు ఉన్నవాళ్లకే సీట్లు దక్కుతాయనే విషయం తేటతెల్లమైందన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల కోసం సీట్లు త్యాగం చేసే విషయంలో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఇలాగే అసంత్రుప్తితో ఉన్నారని సమాచారం.