కాంగ్రెస్ సీనియర్లకు ‘పాపులర్’ టెన్షన్

తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లలో కొత్త పంచాయితీ మొదలైంది. అదేమిటంటే సీనియర్లు అయినంత మాత్రాన టికెట్లు గ్యారెంటీ లేదని తాజాగా అధిష్టానం నుంచి సంకేతాలు అందుతుండటమే. నియోజకవర్గంలో తమకు కాకుండా అధిష్టానం ఇంకెవరికి టికెట్ ఇస్తుందని కొందరు సీనియర్లు ఇంతకాలం చాలా ధీమాగా ఉన్నారు. అయితే పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు అధిష్టానానికి పాపులర్ రిపోర్టు ఇచ్చారనే ప్రచారం మొదలవ్వటంతో కొందరు సీనియర్లలో టెన్షన్ మొదలైంది.

ఇంతకీ ఆ పాపులర్ రిపోర్టు ఏమిటంటే సునీల్ బృందం మొత్తం 119 నియోజకవర్గాల్లో పాపులర్ సర్వే పేరుతో ఒక సర్వే చేసింది. ఈ సర్వే ఎందుకంటే కచ్చితంగా గెలిచేదెవరు ? అనే విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ సర్వేలో సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. ఈ పార్టీ ఆ పార్టీలో నేతన్న పట్టింపులేదు. ఎవరైతే గెలుస్తారు అన్న ప్రాతిపదికనే సర్వే నిర్వహించారు. అందులో పలానా పార్టీలో నేతైతే కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే గెలుస్తారు అని జనాలు అనుకుంటే ఆ నేత పేరును సునీల్ టీం రిపోర్టులో పెట్టింది.

అలాగే జూనియర్ అయినా పార్టీలో మంచి పేరుందని, బాగా కష్టపడుతున్నాడని టికెట్ వస్తే తప్పక గెలుస్తాడని జనాలు అనుకుంటే అలాంటి జూనియర్ నేత పేరును సునీల్ తన రిపోర్టులో ప్రస్తావించారట. దీనివల్ల ఏమైందంటే సీనియర్, జూనియర్ అని కాకుండా గెలుపు గుర్రం ఎవరు అన్న విషయం మీదే సునీల్ సర్వే నిర్వహించారు. సర్వే రిపోర్టు ప్రకారమే నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో వివరించారట.

సునీల్ తాజా రిపోర్టునే పార్టీ పాపులర్ సర్వే అనంటున్నారు. దీని ప్రకారం కొందరు సీనియర్లకు టికెట్లు గ్యారెంటీ లేకుండా పోయిందట. బీఆర్ఎస్ నుండి మైనంపల్లితో పాటు కొడుక్కి రెండు టికెట్లు ఇవ్వటానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కు ఈ పాపులర్ సర్వేనే కారణమట. అలాగే ఇతర పార్టీల్లోని గట్టి నేతలకు కాంగ్రెస్ గాలమేస్తోందని సమాచారం. ఇదంతా చూసిన తర్వాత సీనియారిటి అన్నది కాకుండా గెలుపు గుర్రం అయితేనే టికెట్ అని అధిష్టానం ఆలోచిస్తున్నదట. 6వ తేదీన ఏ విషయం తేలిపోతుందని పార్టీలో టాక్ నడుస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.