వారాహి విజయ యాత్ర.. ఈ సారి అదే ఆయుధం

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా మారాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పొలిటికల్ హీట్ రాజుకుంది. రిమాండ్ మీద బాబు జైల్లో ఉండటం.. లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం.. టీడీపీతో పొత్తును జనసేన అధినేత పవన్ ప్రకటించడం.. ఇలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడీ పొలిటికల్ హీట్ ను మరింత పెంచేందుకు జనసేనాని పవన్ బరిలో దిగుతున్నారు. ఆదివారం (అక్టోబర్ 1) నుంచి నాలుగో విడత జనసేన వారాహి విజయ యాత్రను ప్రారంభించనున్నారు.

ఇప్పటికే మూడు విడతలుగా సాగిన వారాహి విజయ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు నాలుగో విడత యాత్రను ఉమ్మడి క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పవన్ ప్రారంభించనున్నారు. ఈ నాలుగో విడత యాత్రలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయాన్నే ఆయుధంగా మలుచుకుని సీఎం జగన్ పై పవన్ మాటలతో రెచ్చిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు అరెస్టు విషయం తెలియగానే విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించిన పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డు మీద పడుకుని హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జైల్లో రిమాండ్ మీద ఉన్న బాబును కలిసిన తర్వాత పవన్ పొత్తు విషయం ప్రకటించారు.

ఇప్పుడిక వారాహి విజయ యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్న పవన్.. బాబు అరెస్టు అక్రమమని నినదిస్తూ, వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడే ఆస్కారముంది. రాజకీయ కక్షతోనే జగన్ ఇవన్నీ చేస్తున్నారని, తాము కూడా యుద్ధానికి సిద్ధమని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాలుగో విడత వారాహి విజయ యాత్రలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమతో పొత్తులో ఉన్న టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా పవన్ ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.