పెద్ద రిలీఫ్ ఇచ్చిన కేజ్రీవాల్

ఇండియా కూటమికి ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పెద్ద రిలీఫే ఇచ్చారు. తాను ఇండియాకూటమితోనే ఉంటానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే సీట్ల విషయంలో విభేదాలు రావటంతో కేజ్రీవాల్ కూటమి నుండి బయటకు వెళిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే కూటమికి పెద్ద దెబ్బనే అనుకోవాలి. అయితే జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని తాను కూటమిలోనే కంటిన్యు అవుతానని కేజ్రీవాల్ ప్రకటించటంతో కూటమిలోని ఇతర పార్టీలు పెద్ద రిలీఫ్ పీలయ్యాయి.

విషయం ఏమిటంటే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలనే విషయం కీలకం కాబోతోంది. ఎందుకంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేని ఓడించాలంటే వన్ ఆన్ వన్ అనే పద్దతిలో కూటమి తరపున అభ్యర్ధులను పోటీలోకి దించాలని కూటమి అనుకుంటోంది. ఇది కొంచెం కష్టమైనదే అయినా పార్టీలు త్యాగాలకు సిద్ధపడితే ఆచరణ సాధ్యమే. ఇందులో భాగంగానే ఢిల్లీలోని ఏడు సీట్లను కాంగ్రెస్ తమకే వదిలేయాలని ఆప్ అడిగితే కాంగ్రెస్ కాదు పొమ్మన్నది.

అప్పటినుండి ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని కేజ్రీవాల్ మాట్లాడుతూ సీట్ల కేటాయింపు, పోటీ చేయబోయే స్ధానాలను తాను కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలతో మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటానని ప్రకటించారు. సీట్ల సర్దుబాటుకు కూటమి తరపున తొందరలోనే ఒక ఫార్ములా రెడీ అవుతోందన్నారు. తనకు ఏ పార్టీతోను విభేదాలు లేవని చిన్న చిన్న విషయాలపై తొందరలోనే సర్దుబాటు చేసుకుంటానని ప్రకటించారు.

నిజంగా కేజ్రీవాల్ నుండి ఇలాంటి ప్రకటనను చాలామంది ఊహించలేదు. ఎందుకంటే అరవింద్ చాలా మొండి మనిషి. తాను అనుకున్నదే జరగాలనే పట్టుదల ఎక్కువ. అలాంటి కేజ్రీవాల్ ఇతర పార్టీలతో సర్దుబాటు చేసుకుంటామని, సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటామని ప్రకటించారంటేనే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కేజ్రీవాల్ తాజా ప్రకటనకు కారణం ఏమిటంటే నరేంద్రమోడీనే అని చెప్పాలి. కేజ్రీవాల్ ను మోడీ లేవకుండా చావకొడుతున్నారు. మోడీని తప్పించుకోవాలంటే బలమైన అండ కేజ్రీకి చాలా అవసరం. అందుకనే పరిస్ధితులకు తగ్గట్లుగా కేజ్రీవాల్ సర్దుకుని వెళుతున్నట్లున్నారు.