‘మోత మోగిద్దాం రండి!’: నారా బ్రాహ్మ‌ణి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోడ‌లు, నారా లోకేష్ స‌తీమ‌ణి నారా బ్రాహ్మ‌ణి నేరుగా క‌ద‌న‌రంగంలోకి దిగిపో యారు. నారా చంద్ర‌బాబు అరెస్టు, జైలును నిర‌సిస్తూ.. రాష్ట్రంలో చేప‌ట్టిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఆమె ప్ర‌త్య క్షంగా పాల్గొంటూ యువ‌త‌ను ప్రోత్స‌హిస్తున్నారు. అదేస‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వంపై స‌మ‌ర శంఖం కూడా పూరించారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌ను మ‌రింత ముమ్మ‌రం చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు ఉద్య‌మ పిలుపునిచ్చారు.

“మోత మోగిద్దాం రండి!” పేరుతో చంద్ర‌బాబు అరెస్టుకు నిరసనగా భారీ కార్య‌క్ర‌మానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా… వైసీపీ ప్ర‌భుత్వానికి వినిపించేలా సెప్టెంబర్ 30(శ‌నివారం), రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు ఆమె పిలుపు నిచ్చారు. ప‌ళ్లాల‌పై గ‌రిట‌ల‌తో కానీ, డ‌ప్పులు మోగిస్తూ కానీ.. త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేయ వ‌చ్చ‌ని బ్రాహ్మ‌ణి సూచించారు.

అంతేకాదు, ప్రజలు తెలియ‌ప‌రిచే నిరసన కార్య‌క్ర‌మానికి సంబంధించి.. సెల్ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కూడా బ్రాహ్మ‌ణి సూచించారు. “నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే. 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలి. ఇంట్లోనో, ఆఫీస్‌లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయండి. రోడ్డు మీద వాహనంతో ఉంటే 5 నిమిషాల‌పాటు హారన్ కొట్టండి” అని నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు.