కాంగ్రెస్ లో ‘మైనంపల్లి’ లొల్లి

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు అలా చేరారో లేదో ఇలా లొల్లి మొదలైపోయింది. మైనంపల్లి కేంద్రంగా సీనియర్లు అధిష్టానం ముందు గొడవ మొదలు పెట్టేశారు. దేనికంటే తమకు కూడా డబుల్ టికెట్లు ఇవ్వాల్సిందే అని. రాబోయే ఎన్నికల్లో తెలంగాణా మొత్తం మీద ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని మొదట్లోనే అధిష్టానం స్పష్టంగా చెప్పింది. అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.

ఎందుకంటే ఉత్తమ్ దంపతులు ఎప్పటినుండో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి. ఈ విషయమై అధిష్టానం గట్టిగా ఉండటంతో సీనియర్లు ఏమీ మాట్లాడలేకపోయారు. అయితే బీఆర్ఎస్ నుండి కొత్తగా కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లికి కూడా అధిష్టానం మినహాయింపు ఇచ్చింది. మల్కాజ్ గిరి నుండి మైనపంల్లికి, మెదక్ నుండి కొడుకు రోహిత్ రావుకు టికెట్లు ఖాయం చేసింది. దాంతో చాలామంది సీనియర్లకు మండిపోయింది. దశాబ్దాల పాటు పార్టీలో పనిచేస్తున్న తమ కుటుంబాలకు రెండో టికెట్ ఇవ్వడానికి ఇష్టపడని అధిష్టానం కొత్తగా చేరిన హనుమంతరావుకు మాత్రం మినహాయింపు ఇవ్వడం ఏమిటని గోలచేస్తున్నారు.

మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు రావటంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెరవెనుక చక్రం తిప్పారని సీనియర్లు బాగా గుర్రుగా ఉన్నారు. తమ కుటుంబాల్లో రెండు టికెట్లు ఇవ్వాల్సిందే అని దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, కొండా సురేఖ, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు ఎప్పటినుండో పట్టుబడుతున్నారు.

అయితే మైనంపల్లి కేసు సపరేటు కేసుగా అధిష్టానం చూసిందట. ఎందుకంటే మల్కాజ్ గిరిలో తాను గెలవటమే కాకుండా మెదక్, మేడ్చల్ నియోజకవర్గాలను కూడా తాను గెలిపిస్తానని మైనంపల్లి పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చారట. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలీదు కానీ మైనంపల్లి ప్రభావం మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఉంటుందన్నది వాస్తవమే. ఆర్ధిక, అంగ బలం అపారంగా ఉన్న మైనంపల్లికి నాలుగు నియోజకవర్గాల్లో బలమైన మద్దతుదారులున్నారు. ఈ కారణంగానే చివరి నిముషం వరకు మైనంపల్లి పార్టీ మారకుండా కేసీయార్ ప్రయత్నించారు. మరి మైనంపల్లి తన హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాల్సిందే.