బీజేపీ కొత్త డ్రామానా ?

ఎన్నికలు మరో ఆరు మాసాల్లో ఉందనగా బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపిందా ? జరుగుతున్నది చూస్తుంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నారు. మీడియాతో జీవీఎల్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కనీసం ఇప్పట్లో లేనట్లే అని ప్రకటించారు. ఇంతముఖ్యమైన నిర్ణయాన్ని ఒక మామూలు ఎంపీ ప్రకటించటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటీకరణ నుండి వెనక్కు తగ్గేదేలేదని కేంద్ర మంత్రులు పార్లమెంటులోనే ప్రకటించారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా వైజాగ్ లో ఫ్యాక్టరీ ఉద్యోగ, కార్మికులు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, జనాలు ఎన్ని ఆందోళనలు చేసినా తగ్గేదేలే అన్న సినిమా డైలాగును పదేపదే వినిపించారు. అలాంటిది ప్రైవేటీకరణ చేయబోవటంలేదన్న ముఖ్యమైన నిర్ణయాన్ని ఒక ఎంపీ ఎలా ప్రకటించగలరు ?

కాబట్టి జీవీఎల్ ప్రకటన ఉత్త రాజకీయ డ్రామాగా జనాలు అనుమానిస్తున్నారు. డ్రామా ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఈ రాజ్యసభ ఎంపీ లోక్ సభకు వైజాగ్ నుండే పోటీచేయాలని అనుకుంటున్నారు. ఇపుడు వాస్తవ పరిస్ధితి ఏమిటంటే అనేక కారణాలతో జనాలంతా నరేంద్రమోడీ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకోవాలంటే ఏదో ఒక మాయచేయాల్సిందే. ఇప్పటికిప్పుడు జీవీఎల్ చేయగలిగిన మాయ ఏమీలేదు. అందుకనే జనాలందరికీ సెంటిమెంటుగా నిలిచిన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగటంలేదని ప్రకటించారు.

ఇదే ప్రకటనను స్వయంగా మోడీయే చేసినా జనాలు నమ్మరు. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉండి మోడీ ఎన్ని అబద్ధాలు చెబుతున్నారో అందరు చూస్తున్నదే. రాష్ట్రప్రయోజనాలను పదేపదే తుంగలో తొక్కేస్తున్నారు. అలాంటిది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కేంద్రం ఆపేసిందని ఒక ఎంపీ చెబితే నమ్మేజనాలు ఎవరూ లేరు. అందుకనే ఇదంతా ఫక్తు ఎన్నికల డ్రామాగానే చూస్తున్నారు. ప్రైవేటీకరణ నుండి వెనక్కు తగ్గినట్లు, ఫ్యాక్టరీకి గనులను కేటాయిస్తున్నట్లు, అవసరమైన మూలధనాన్ని అందిస్తున్నట్లు కేంద్ర క్యాబినెట్ ప్రకటిస్తే అప్పుడు జనాలు నమ్ముతారేమో. లేకపోతే అప్పటివరకు జీవీఎల్ ది డ్రామానే అంటారంతా.