చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు పలు ప్రాంతాలలో ర్యాలీలు, ధర్నాలు చేసి తమ నిరసనను తెలియజేశారు. అయితే, తాజాగా ఆ ర్యాలీలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ర్యాలీలు ఏపీలో చేసుకోవాలని, ఆంధ్రా రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం అని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయేలాగా ర్యాలీలు చేసుకోవాలని, ఇక్కడ హైదరాబాదులో ర్యాలీ చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాదులో ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని లోకేష్ తనకు ఫోన్ చేసి ప్రశ్నించారని, అయితే, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని అనుమతి ఇవ్వలేదని ఆయనకు చెప్పానని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ర్యాలీలు చేస్తే ఐటీ కారిడార్ డిస్టర్బ్ అవుతుందని, ఈ రోజు వీళ్ళు చేస్తే రేపు వాళ్ళు చేసి పోటాపోటీగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తున్న సందర్భంగా కూడా ఐటీ కారిడార్ లో ర్యాలీలు, నిరసనలు జరగలేదని గుర్తు చేశారు.

వ్యక్తిగతంగా ఎవరైనా చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడవచ్చని, కానీ, అది పార్టీకి సంబంధం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య తగాదా అని, వారికి తెలంగాణలో ఎటువంటి స్థానం లేదని కేటీఆర్ అన్నారు. అటువంటప్పుడు ఇక్కడ ర్యాలీలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అలాగే హ్యాండిల్ చేస్తున్నామని అన్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్ విషయం కోర్టు పరిధిలో ఉందని, న్యాయపోరాటం చేసిన తర్వాత ఏం జరుగుతుందో వారు చూసుకుంటారని చెప్పారు. అయితే, ఏపీతో తమకు తగాదాలు లేవని, తనకు జగన్, లోకేష్, పవన్ అందరూ మిత్రులేనని కేటీఆర్ అన్నారు.