ఈ అమ్మాయి క‌థ చ‌దివి తీరాల్సిందే

అన్ని సౌక‌ర్యాలూ ఉంటాయి. దేనికీ లోటుండ‌దు. శుభ్రంగా చ‌దువుకోమంటే చాలామందికి శ్ర‌ద్ధ ఉండదు. ఇంకొంత‌మందేమో.. సౌక‌ర్యాల లేమిని, ఆర్థిక ఇబ్బందులనే సాకుగా చూపించి స‌రిగా చ‌ద‌వ‌రు. కానీ మ‌హారాష్ట్ర‌కు చెందిన స్వ‌ప్నాలి సుతార్ మాత్రం అలా కాదు.

ఆమెకు ఎటు చూసినా ఇబ్బందులే. కానీ అవేవీ ఆమె చ‌దువులో అద్భుతాలు చేయ‌నివ్వ‌కుండా ఆప‌లేదు. మారు మూల అట‌వీ ప్రాంతంలో పుట్టిన గిరిజ‌న అమ్మాయి స్వ‌ప్నాలి. త‌న‌ది పేద కుటుంబం. త‌ల్లిదండ్రులు క‌ష్టం చేసి బ‌తుకు సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల‌కు తోడు.. ప‌ట్నానికి వెళ్లి చ‌దువుకోవ‌డానికి స‌రైన రోడ్డు కూడా లేని ప‌రిస్థితి స్వ‌ప్నాలిది.

అయితేనేం 12 తరగతిలో 98% స్కోర్ చేసిన‌ స్వప్నాలి .. ఇప్పుడు వెట‌ర్న‌రీ క‌ళాశాల‌లో చ‌దువుకుంటోంది. వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ కావాల‌న్న ల‌క్ష్యంతో అడుగులేస్తున్న ఆమెకు లాక్ డౌన్ బ్రేక్ వేసింది. కాలేజీకి వెళ్లే ప‌రిస్థితి లేదు. మిగతా విద్యార్థులంద‌రూ ఇంటి ద‌గ్గ‌రే ఉంటూ ఇంటర్నెట్ సౌక‌ర్యంతో ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారు. చ‌క్క‌గా చ‌దువుకుంటున్నారు. కానీ స్వ‌ప్నాలి ఉంటున్న‌ గ్రామానికి ఇంటర్నెట్ కనెక్టివిటీనే లేదు. ఫోన్లో సిగ్న‌ల్ కూడా రాదు.

దీంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితుల్లో కొన్ని రోజుల పాటు ఐదు కిలోమీట‌ర్ల దూరం న‌డిచి వెళ్లి ఇంట‌ర్నెట్ వ‌చ్చే చోట చ‌దువుకునేది. కానీ అలా ఎక్కువ రోజులు చేయ‌లేక‌పోయింది. పైగా ఇది వ‌ర్షాకాలం కావ‌డంతో మ‌రింత ఇబ్బంది త‌లెత్తింది. దీంతో స్వ‌ప్నాలి సోద‌రులు ఆమె కోసం గ్రామానికి దగ్గరలో ఒక కొండపై ఒక షెడ్ నిర్మించారు. అక్కడ ఆమె ఫోన్ కు ఇంటర్నెట్ సిగ్నల్ వస్తుంది. అక్కడే రోజూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు చదువుకుని ఇంటికి చేరుతోంది స్వ‌ప్నాలి.

త‌న గురించి మీడియాలో రావ‌డంతో చాలామంది సాయం చేయ‌డానికి ముందుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రూ.50 వేల ఆర్థిక సాయం కూడా అందించాడు. లాక్ డౌన్ హీరో సోనూ సూద్ సైతం ఈ అమ్మాయి గురించి స్పందించడం విశేషం. స్వప్నాలి ఊర్లో వైఫై వస్తుందని అతను హామీ ఇచ్చాడు.