తగ్గని పొంగులేటి, తుమ్మల.. మరి పాలేరు ఎవరికి?

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ కిందామీదా పడుతోంది. దాదాపు 80 స్థానాల్లో అభ్యర్థులను సులువుగానే ఖరారు చేసేలా కనిపిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానానికి మిగిలిన స్థానాల్లో ఇబ్బందులు తప్పడం లేదని తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండటమే అందుకు కారణం. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కూడా ఉంది. కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మధ్య పోటీ నెలకొంది.

మొదటి నుంచి కూడా పాలేరు నియోజకవర్గం ఆసక్తి కలిగిస్తూనే ఉంది. ఇక్కడి నుంచి ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారన్నది సందిగ్ధంగానే మారింది. అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మరోసారి కేసీఆర్ పాలేరు టికెట్ కేటాయించారు. దీంతో అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరిపోయారు. అంతకుముందే బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుని పొంగులేటి కూడా హస్తం గూటికే చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమైన షర్మిల.. పాలేరు టికెట్ అడిగారనే వార్తలూ వచ్చాయి.

ఇప్పుడు పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు నిలబడతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అయినప్పటికీ పాలేరులో కాంగ్రెస్ క్యాడర్ యాక్టివ్ గానే ఉంది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయడం కోసం పొంగులేటి, తుమ్మల పట్టు బడుతున్నారు. పొంగులేటి ఎప్పటి నుంచో పాలేరుపై కన్నేశారు. కాంగ్రెస్ లో చేరే ముందు కూడా పాలేరు టికెట్ కోసం అధిష్ఠానంతో పొంగులేటి చర్చలు జరిపినట్లు తెలిసింది. మరోవైపు పాలేరు టికెట్ హామీ మేరకే తుమ్మల కాంగ్రెస్లో చేరారని చెబుతున్నారు. అలా కాదని ఖమ్మం నుంచి తుమ్మలను పోటీ చేయమంటే ఆయన ఒప్పుకోవడం లేదని తెలిసింది. మరి వీళ్లిద్దరి టికెట్ పంచాయతీని అధిష్ఠానం ఎలా తీరుస్తుందో చూడాలి.