ఏపీలో ఉత్కంఠ‌.. బాబుకు బెయిల్ వ‌చ్చేనా? ఏం జ‌రుగుతుంది?  

ఏపీలో న‌రాలు తెగే ఉత్కంఠ భ‌రిత వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. ఇటు రాజ‌కీయ నాయ‌కులే కాదు.. అటు సాధార‌ణ పౌరులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏం జ‌రుగుతుంది?  టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బెయిల్ వ‌స్తుందా?  రాదా? అని అన్ని వ‌ర్గాలు ఎదురు చూస్తున్నాయి. చంద్ర‌బాబు బెయిల్‌పై ఈ రోజు(మంగ‌ళ‌వారం) ఒకే సారి రెండు కోర్టుల్లో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. చంద్ర‌బాబు బెయిల్ కోరుతూ.. ఇటు ఏసీబీ కోర్టులో, అటు హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై ఒకే రోజు విచార‌ణ జ‌ర‌గ‌డం.. అరుదైన ఘ‌ట‌న‌గా న్యాయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో జరిగే విచారణలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పైనా ఈ రోజు ఏసీబీ కోర్టులో వాదనలు జర‌గ‌నున్నాయి. మ‌రో వైపు, రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి.. సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో ముంద‌స్తు బెయిలు కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పైనా విచారణ జరగనుంది.

ఇక‌, స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 10న జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్పైనా హైకోర్టు విచారణ జరపనుంది. మొత్తంగా రెండు కోర్టుల్లో ఈ రోజు జ‌ర‌గ‌నున్న విచార‌ణ‌ల్లో చంద్ర‌బాబు పిటిష‌న్లే ఉండ‌డంతో ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు..చంద్ర‌బాబుకు బెయిల్ రావాల‌ని టీడీపీ నాయ‌కులు కోరుకుంటున్నారు. అయితే.. వైసీపీ దీనికి భిన్నంగా కామెంట్లు చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా పూజ‌లు

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు.. ఈ రోజు అన్ని గ‌ణ‌ప‌తి మండ‌పాల్లోనూ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తు న్నారు. చంద్ర‌బాబుకు బెయిల్ రావాల‌ని కోరుతూ.. రాష్ట్రంలోని అన్ని గ‌ణేష్ మండ‌పాలు స‌హా.. ప్ర‌సిద్ధ ఆల‌యాల్లోనూ పూజ‌లు చేయ‌నున్నట్టు నాయ‌కులు తెలిపారు. అదేస‌మ‌యంలో అన్న‌దానాలు కూడా చేయ‌నున్నారు. మొత్తంగా ఈ రోజు చంద్ర‌బాబు విష‌యంలో ఏం జ‌రుగుతుంద‌నేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ‌గా మార‌డం గ‌మ‌నార్హం.