చంద్రబాబుతో ములాఖత్.. రజినీ ఏమన్నాడంటే?

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ విషయంలో బాబుకు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీల నేతలు బాసటగా నిలిచారు. అలాగే సామాన్య జనం కూడా తెలుగు రాష్ట్రాల్లోనే దేశ విదేశాల్లో బాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరుగుతుండటం విశేషం. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా పాల్గొంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ వాళ్లు కూడా ఈ స్పందన చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబుకు సన్నిహితుడైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజమండ్రికి వచ్చి ఆయన్ని జైల్లో కలుస్తారనే ప్రచారం జరిగింది. ఆదివారం వీరి ములాఖత్ ఉంటుందని మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. కానీ రజినీ రాజమండ్రికి రాలేదు. అలా అని బాబు అరెస్ట్ విషయంలో ఆయనేమీ మౌనం వహించలేదు.

చంద్రబాబును రాజమండ్రిలో తాను కలవాలనుకున్న మాట వాస్తవమే అని.. కానీ కుటుంబ కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోయానని రజినీ తమిళ మీడియాకు వెల్లడించారు. ఆదివారం చెన్నై నుంచి కోయంబత్తూరుకు వెళ్తూ ఎయిర్‌పోర్ట్ దగ్గర మీడియాతో మాట్లాడారు రజినీ. ఆ సందర్భంగా చంద్రబాబుతో ములాఖత్‌ గురించి అడగ్గా.. కుటుంబ కార్యక్రమాల వల్ల తాను రాజమండ్రికి వెళ్లలేకపోతున్నానని.. కానీ బాబుకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనకు రక్షగా ఉంటాయి. కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు. చేసిన మంచి, ప్రజా సేవే ఆయన్ని బయటికి తీసుకొస్తాయి’’ అని రజినీ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కాగానే నారా లోకేష్‌కు ఫోన్ చేసి రజినీ ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే.