కాంగ్రెస్ సభలోనే షర్మిల పార్టీ విలీన ప్రకటన?

Sharmila

కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి రంగం సిద్ధమైందా? ఆదివారం (సెప్టెంబర్ 17న) జరిగే కాంగ్రెస్ విజయభేరి సభలోనే షర్మిల పార్టీ విలీనం ప్రకటన రానుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ సభలోనే కాంగ్రెస్ లో షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రకటన వెలువడుతుందనే అంచనాలు కలుగుతున్నాయి.

ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర అగ్ర నాయకులు హాజరు కానున్నారు. దీంతో ఈ సభలోనే షర్మిల పార్టీ విలీన ప్రకటన చేయాలని చూస్తున్నారని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు.

కాంగ్రెస్ లో తన పార్టీని కలిపేసేందుకు కొన్ని రోజులుగా షర్మిల ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధిష్ఠానంతో దౌత్యం కోసం బెంగళూరు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను షర్మిలు పలుమార్లు కలిశారనే టాక్ ఉంది. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ ఆమె చర్చలు జరిపారు. కానీ కాంగ్రెస్, షర్మిల మధ్య వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, ఏపీలో ఆమె సేవల గురించి జరిగిన చర్చలు కొలిక్కి రాలేదని తెలిసింది. అందుకే ఇప్పటివరకూ పార్టీ విలీనం జరగలేదని అంటున్నారు. హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయ భేరి సభ సందర్భంగా షర్మిల మరోసారి డీకే శివకుమార్ ను కలిశారని తెలిసింది. సోనియా లేదా రాహుల్ తో భేటీతో పార్టీ విలీన ప్రక్రియను షర్మిల ముగింపు దశకు తెస్తారని టాక్.