బాబు స్కిల్స్‌ ఇస్తే.. జ‌గ‌న్ లిక్క‌ర్‌, గంజాయి ఇస్తున్నారు: బ్రాహ్మ‌ణి

ఏపీ స‌ర్కారుపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో యువ‌త‌కు గ‌త ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు నైపుణ్యాల‌ను నేర్పించి ఉద్యోగాలు ఇచ్చార‌ని తెలిపారు. ఇప్పుడున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం యువ‌త‌కు గంజాయి, లిక్క‌ర్ విరివిగా అందిస్తోంద‌ని బ్రాహ్మ‌ణి తీవ్ర‌స్థాయిలోఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు నాయుడు చేసిన త‌ప్పేంట‌ని, ఆయ‌న‌ను తెల్ల‌వార కుండానే ఎందుకు అరెస్టు చేశార‌ని, ఎందుకు జైల్లో పెట్టార‌ని ఆమె నిప్పులు చెరిగారు. ఈ ప్ర‌భుత్వం దేనికీ స‌మాధానం చెప్ప‌డం లేద‌ని విమ‌ర్శించారు.

చంద్రబాబు అరెస్ట్‌, జైలుపాలు చేయ‌డాన్ని నిర‌సిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రాజమండ్రిలో మహిళలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు చేపట్టిన క్యాండిల్ ర్యాలీకి మద్దతుగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. స్థానిక తిలక్‌ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్‌ రామాలయం జంక్షన్‌ వరకూ ఈ క్యాండిల్‌ ర్యాలీ కొనసాగింది.

ఈ సంద‌ర్భంగా నారా బ్రాహ్మ‌ణి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. “చంద్రబాబు లాంటి సీనియర్ నేతను, విజనరీ నేతను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా జైల్లో పెట్టారు. లక్షలాది మందికి స్కిల్స్ ద్వారా ఉద్యోగాలు వచ్చేలా చంద్ర‌బాబు చేశారు. సంక్షేమం చేయడం నేరమా?“ అని బ్రాహ్మ‌ణి ప్ర‌శ్నించారు. అంతేకాదు, ప్ర‌స్తుత ప్రభుత్వం యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగాలు ఇచ్చే బ‌దులు.. గంజాయి, లిక్కర్ తప్ప ఏమి ఇస్తోంద‌ని నిల‌దీశారు.

త‌మ‌కు మద్దతు తెలుపుతున్న జాతీయ నాయకులకు, ఐటీ ఉద్యోగులందరికి నారా బ్రాహ్మ‌ణి ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ ఒకచోట....మేము ఒకచోట తిరుగుతున్నాం.. నాలాంటి యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన తప్పా? లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారేమో?. రిమాండ్ రిపోర్ట్ చదివితే ఎనిమిదేళ్ళ దేవన్ష్ అయిన అందులో ఏమి లేదని చెప్తాడు. ఇప్పుడు మేము ఒంటరి వాళ్ళం కాదు. మా వెనక టీడీపీ కుటుంబం ఉంది అని నారా బ్రాహ్మ‌ణి వ్యాఖ్యానించారు.