జ‌న‌సేన‌-టీడీపీ…”స్వీట్” షేరింగ్‌!!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాము టీడీపీతో క‌లిసి పోటీ చేయ‌నున్నామంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించిన ద‌రిమిలా రాజ‌కీయంగా ఈ రెండు పార్టీల మ‌ధ్య బంధం ద్రుఢ‌త‌రం కాబోతోంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. జ‌న‌సేనాని ప్ర‌క‌ట‌న‌ను ఇరు పార్టీల నాయ‌కులు, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు కూడా.. స్వాగ‌తిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా.. ఇరు పార్టీల నేత‌లు కూడా స్వీట్లు పంచుకుని సంబ‌రాలు చేసుకుంటున్నారు.

“వ‌చ్చే ఎన్నిక‌లు ఇప్పుడు జ‌రిగినా.. రేపు జ‌రిగినా.. షెడ్యూల్ ప్ర‌కారం 2024లో జ‌రిగినా.. మేం టీడీపీతో క‌లిసి వెళ్తాం. క‌లిసే వెళ్తాం. ఇది మా కోసం.. మా రెండు పార్టీల భ‌విష్య‌త్తు కోసం కాదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం చేస్తున్న ప్ర‌య‌త్నం” అంటూ.. గురువారం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు స‌మీపంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొన్న పొత్తుల‌పై సందేహాలు ప‌టాపంచ‌ల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో టీడీపీ-జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.. చేతులు క‌లిపారు. ప్ర‌స్తుతం రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య అవ‌గాహ‌న పెంపొందించే కార్య‌క్ర‌మాల‌కు కూడా శ్రీకారం చుట్టారు. ఇక‌, తాజాగా టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొన్న జ‌న‌సేన నాయ‌కులు, టీడీపీ నాయ‌కులు కూడా అక్క‌డిక‌క్క‌డ స్వీట్లు తినిపించుకుని.. ఇరు పార్టీల మిత్ర‌త్వాన్ని స్వాగ‌తించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేసేందుకు అనుగుణంగా త‌మ కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని.. నాయ‌కులు ప్ర‌క‌టించారు.

ఎన్నిక‌ల్లో సీట్ల షేరింగ్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల మ‌ద్య స్వీట్ల షేరింగ్‌తో పాటు అభిప్రాయాల షేరింగ్‌… క‌లిసి వ‌చ్చే ప‌రిణామంగా ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని కూల‌దోయ‌డ‌మే ల‌క్ష్యంగా క‌ల‌సి ముందుకు సాగుతామ‌ని ఇరు పార్టీల నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఇదే విష‌యాన్నిజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. ఎన్నిక‌ల్లో సీట్ల షేరింగ్ క‌న్నా స్వీట్ల షేరింగ్ ద్వారా ముందు మ‌న‌సులు క‌లిసి.. తర్వాత కార్యాచ‌ర‌ణ‌కు ముందుకు క‌ద‌లాల‌ని నాయ‌కులు నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు కూడా ఉత్సాహంగా ముందుకు క‌దిలే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.