ఎన్నికల వేళ.. మాజీ సీఎంకు దెబ్బేసిన వియ్యంకుడు

తిరుగులేనట్లుగా వెలిగిపోవటం.. ఏం చేసినా.. ఏమన్నా.. ఎదురులేని తీరుకొందరికి కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఆ టైంలో వారేం చేసినా అదే రైట్ అన్నట్లు ఉంటుంది. అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకునే వారికి తర్వాతి కాలంలో తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు.

లేదంటే.. కష్టాలు తప్పవు. బిహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నితీశ్ తో కలిసి అధికారాన్ని పంచుకున్న వేళలో.. ఒక వెలుగు వెలిగిన ఆయన అక్కడితో ఆగితే బాగుండేది.

అత్యాశతో నితీశ్ కు ఇబ్బందులు షురూ చేయటంతో.. తనకే మాత్రం పొసగని మోడీతో జత కట్టటానికి సైతం సై అనాల్సిన పరిస్థితి. దీంతో.. అప్పటివరకు ఉన్న పవర్ ఒక్కసారిగా చేజారింది. ఆ తర్వాత నుంచి లాలూ ఫ్యామిలీకి ఏదో ఒక కష్టం వెంటాడుతూనే ఉంది.

రెండు.. మూడు నెలల్లో బిహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. చేతికి వచ్చిన ఇద్దరు కొడుకులతో ఏదోలా పవర్ సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో లాలూ ఉన్నా.. ఆయన ప్లాన్లు ఏమీ వర్క్ వుట్ అయ్యే అవకాశం కనిపించటం లేదు.

తాజాగా ఆయన పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు జేడీయూ తీర్థం పుచ్చుకోవటం షాకింగ్ గా మారింది. అందులో ఒకరు లాలూకు స్వయంగా వియ్యంకుడే కావటం గమనార్హం. లాలూ కొడుకు తేజ్ ప్రతాప్ కు తన కుమార్తె ఐశ్వర్యను ఇచ్చి పెళ్లి చేశారు చంద్రికా రాయ్. కొద్దికాలంగా ఈ దంపతులు ఇద్దరు వేర్వేరుగా ఉండటం తెలిసిందే. తాజాగా చంద్రికా రాయ్ జేడీయూలోకి వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే.. పార్టీకి చెందిన ఫరాజ్ పాత్మీ.. జైవర్థన్ యాదవ్ ఇద్దరూ జేడీయూ తీర్థం తీసుకున్నారు. కేంద్రమంత్రిగా వ్యవహరించిన మహ్మద్ అలీ అష్రఫ్ ఫాత్మీ కుమారుడు ఫరాజ్ ఫాత్మీ. ఆయన 2004-2009 మధ్య కాలంలో కేంద్రమంత్రిగా వ్యవహరించారు. ఆయన గత ఏడాది జులైలో పార్టీ మారారు.

తాజాగా తండ్రి బాటలో పయనించిన కొడుకు సైతం జేడీయూలో చేరారు. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళలో.. ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీ మారటాన్ని లాలూ జీర్ణించుకోలేకోలేకపోతున్నారు. సరిగ్గా ఎన్నికలకు దగ్గర్లో ఇలాంటి చోటు చేసుకోవటం.. ఇవేవీ అంత మంచి శకునాలు కావన్న మాట వినిపిస్తోంది.