అసలు చంద్రబాబు వ్యూహమేంటి?

స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసుకు సంబంధించి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదో చిన్న కేసని.. చంద్రబాబును జగన్ సర్కారు ఏమీ చేలేదని.. బాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు లేవని.. ఆయన సింపుల్‌గా ఇలా అరెస్ట్ అయి అలా బయటికి వచ్చేస్తారని తెలుగుదేశం వర్గాలు తొలి రోజు ధీమాగా ఉన్నాయి. కానీ వారి అంచనాలకు భిన్నంగా కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించారు. దీంతో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు మూడు రోజులుగా.

సోమవారం ఆయనకు బెయిల్ వచ్చేస్తుందని గట్టిగా ప్రచారం జరిగింది కానీ.. ఆ రోజు అలాంటిదేమీ జరగలేదు. ఇంకో రెండు రోజులు గడిచిపోయినా బాబు జైల్లోనే ఉన్నారు. బెయిల్ ప్రస్తావనే రావట్లేదు. బాబు ఎ-37గా ఉన్న కేసులో ఇంకా బెయిల్ రాకపోవడం ఏంటి అనే సందేహం ఆయన అభిమానులను వెంటాడుతోంది.

ఐతే అసలు విషయం ఏంటంటే.. అరెస్ట్ అయిన రోజు నుంచి బాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన లాయర్లు ప్రయత్నమే చేయట్లేదు. ఈ మేరకు పిటిషన్ కూడా వేయట్లేదు. అరెస్ట్ రోజే బెయిల్ పిటిషన్ వేసి ఉంటే.. ఆటోమేటిగ్గా ఆయనకు బెయిల్ వచ్చేదని, ఆ రోజే కాక తర్వాత కూడా బాబు లాయర్లు బెయిలే అడగట్లేదని వెల్లడి కావడం బాబు ఫ్యాన్స్‌కు పెద్ద షాక్. మరి చంద్రబాబు ఎందుకు బెయిల్ కోసం ప్రయత్నించట్లేదన్నది ఇక్కడ ఆసక్తి రేకెత్తించే విషయం.

ఐతే బాబు బెయిల్ తీసుకుని బయటికి వస్తే.. ఈ కేసును జగన్ సర్కారు సాగదీయడం ఖాయమని.. విచారణ పేరుతో ఆయన్ని తరచుగా ఇబ్బంది పెడతారని.. ఈ తలనొప్పి ఇంతటితో వీడదని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాక జగన్ కొన్నేళ్ల నుంచి అవినీతి కేసుల్లో బెయిల్ మీద ఉండగా.. తాను కూడా బెయిల్‌పై బయటికి వస్తే ఇద్దరం ఒకటే అనే సంకేతాలను జనాలకు జగన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడని.. అందుకే బెయిల్ తెచ్చుకోవడం కంటే.. కేసు ఎంత బలహీనమో చెబుతూ.. తనకు వ్యతిరేకంగా ఆధారాలే లేని విషయాన్ని రుజువు చేస్తూ క్వాష్ పిటిషన్ వేయడం ద్వారా మొత్తంగా కేసు కొట్టివేయించి బయట పడాలని బాబు చూస్తున్నాడన్నది స్పష్టం. ఈ కేసును ఇలా కొట్టివేయిస్తే.. జగన్‌కు అది గట్టి ఎదురు దెబ్బ అవుతుందని, తనను వేరే కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడానికి కూడా వెనుకంజ వేస్తారని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.