తాజా పరిణామాలపై నడ్డా ఆరా

చంద్రబాబునాయుడు అరెస్టు, జ్యూడీషియల్ రిమాండ్ తదితర పరిణామాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీస్తున్నారు. చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో టీడీపీ రాష్ట్ర బంద్ పిలుపు ఇవ్వటం, బంద్ పిలుపులో జనసేన, వామపక్షాలు యాక్టివ్ గా పాల్గొనటం తదితర అంశాలపై ఏపీలోని కొందరు నేతలతో నడ్డా సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో రాష్ట్రంలో తలెత్తిన పరిణామాలను లోకల్ నేతలు నడ్డాకు వివరించినట్లు తెలిసింది.

చంద్రబాబు అరెస్టుపై జనాలు ఎలా స్పందిస్తున్నారు ? సానుభూతి ఏ మాత్రం కనబడుతోంది ? అనే విషయాలపై ప్రత్యేకంగా సమాచారం సేకరించారట. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయమై ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది వ్యవహారం. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే బీజేపీకి చెబుతున్నారు.

పవన్, చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డిపైన ఉన్న కసి బీజేపీ పెద్దలకు లేదన్న విషయం గ్రహించాలి. అందుకనే నరేంద్రమోడీ, అమిత్ షా ఈ విషయంలో చాలా నింపాదిగా ఉన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే విషయమై మోడీ ఏమి నిర్ణయం తీసుకున్నారో తెలీదు కానీ బయటకు మాత్రం ఏమీ చెప్పలేదు. దాంతో పొత్తుల విషయం పదేపదే చర్చకు వస్తునే ఉంది. ఒకవైపు జమిలి ఎన్నికలని, ముందస్తు ఎన్నికలనే సంకేతాలు అందుతున్నాయి.

ఈ నేపధ్యంలో సడెన్ గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టయ్యారు. మరి దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలాగుంటుందనే విషయంపైనే నడ్డా రాష్ట్రంలోని కొందరు నేతలతో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో జనాల్లో సానుభూతి ఉందా ? ఉంటే ఏ స్ధాయిలో ఉంది అది రేపటి ఎన్నికల్లో ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుందనే విషయాలను బీజేపీ భేరీజు వేస్తోందని అర్ధమవుతోంది. మరి చివరకు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.