చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ..వైరల్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ ల నేపథ్యంలో ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించి అన్యాయంగా అరెస్టు చేశారని టీడీపీ అభిమానులు వాదిస్తుండగా…ఆ నిజాయితీని కోర్టులో నిరూపించుకొని బయటకు రావాలని వైసీపీ అభిమానులు అంటున్నారు. ఇక, ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాను దాటి ఫ్లెక్సీ వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టును సెలబ్రేట్ చేసుకుంటూ…సీనియర్ ఎన్టీఆర్ ఆత్మశాంతించిందని వైసీపీ జూ.ఎన్టీఆర్ అభిమానులు వేసిన ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి.

బొబ్బర్లంక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్ గా మారాయి. ‘‘థ్యాంక్యూ జగన్…నా ఆత్మకు శాంతి కలిగించావు..చివరి రోజుల్లో నన్ను ఎన్నో అవమానాలకు, మానసిక క్షోభకు గురి చేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నా మరణాన్ని వాడుకొని, నేను చనిపోయిన తర్వాత నా కొడుకు హరికృష్ణ మరణాన్ని కుటిల రాజకీయాలకు వాడుకొని, చివరకు లోకేష్ రాజకీయాల కోసం నా మనవడు తారక రత్న మరణాన్ని కూడా వాడుకున్నారు. సెప్టెంబరు 10 చంద్రబాబును జైలుకు పంపడంతో నా ఆత్మకు శాంతి కలిగింది. అందుకే, సెప్టెంబరు 10న తెలుగు ప్రజలంతా ‘ఆత్మ శాంతి’ దినోత్సవంగా జరుపుకోవాలి…ఇట్లు..సీనియర్ ఎన్టీఆర్ ’’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.

అంతుకుముందు, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి కూడా ఇదే తరహాలో చంద్రబాబు అరెస్టయిన రోజు ఆయన ఆత్మ శాంతించిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వెళ్లి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన ఆమె..ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమెతోపాటు పలువురు వైసీపీ నేతలు కూడా ఇదే తరహా కామెంట్లు చేయడం, ఆ కామెంట్లు జూ.ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీగా వేయడం సంచలనం రేపుతోంది.