ఇక యుద్ధమే…జగన్ పై పవన్ ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్త బంద్ నకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ బంద్ నకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయనకు పవన్ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలోనే జగన్ పై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్ధిక నేరాలు చేసిన జగన్ కోర్టు అనుమతితో బయట, విదేశాలకు తిరుగుతుంటారని పవన్ దుయ్యబట్టారు. మనదేశంలో చట్టాలు పూర్తి స్థాయిలో పనిచేస్తే జగన్ సీఎం కాగలడా అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీ20 సదస్సునుంచి దృష్టి మళ్లించేందుకే ఏపీ ప్రభుత్వం ఈ కుట్ర చేసిందని, దానిని కేంద్రం లోతుగా అధ్యయనం చేయాలని అన్నారు. వేలకోట్లు దోచేసిన జగన్ విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి కావాలని, చిన్నాన్నను చంపిన కేసులో వేళ్లన్నీ ఆ ఇంటివైపే చూపిస్తున్నాయని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో నిందితులకు సులువుగా బెయిల్ వచ్చేస్తుందని, వివేకాను చంపిన వాళ్లు బయట తిరుగుతున్నారని, చట్టాలు ఎక్కడ పని చేస్తున్నాయనే అనుమానం కలుగుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను జగన్ వేరేస్థాయికి పట్టుకెళ్లిపోయారని, ఫిజికల్ బ్యాటిల్ కావాలని కోరుకుంటున్నారని పవన్ ధ్వజమెత్తారు.

ఒకవేళ యుద్ధమే కావాలంటే రోడ్లమీదే తామూ ఉంటామని, రేపటి నుంచి తామేంటో చూపిస్తామని పవన్ హెచ్చరించారు. వివేకాది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ప్రూవ్ అయిందని, అయినా సరే నిందితులు బయట తిరుగుతుంటే కోర్టులపై ప్రజల్లో నమ్మకం ఎలా ఉంటుందని, చట్టాలపై గౌరవం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. జగన్ ఒక క్రిమినల్, సైకోపాత్ అని, అతడిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అందరినీ జైలుకు పంపాలన్నదే జగన్ ఆలోచన అని, అటువంటి నియంతళ ఫ్యాక్షనిజం ఏపీలో చెల్లదని వార్నింగ్ ఇచ్చారు. ఇంట్లో మర్డర్లు చేయించి, మానభంగాలను చేసిన వారిని వెనుకేసుకొస్తారని మండిపడ్డారు.

జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి హానికరం అని, ఏపీ బాగుండాలంటే.. జగన్ ను పదవి నుంచి దించేయాలని పిలుపునిచ్చారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని దుస్థితిలో జగన్ ఉన్నాడని, తనకు ఎవరూ ఎదురు ఉండకూడదని అనుకునే నియంత అని విమర్శించారు. వైసీపీ అక్రమాలను వదిలేది లేదని, ఇక యుద్ధమే అని సమర శంఖం పూరించారు. జగన్ దోచుకున్న డబ్బును ఇంగ్లండ్ లో దాచుకున్నాడని అనుకుంటున్నారని, దీనిపై నిజానిజాలు కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించాలని పవన్ అన్నారు.

అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని, తెలంగాణ ప్రజలు జగన్ ను రాళ్లతో తరిమికొట్టారని, రేపు ఏపీలో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని జోస్యం చెప్పారు. కోనసీమలో తన వారాహి యాత్రను భగ్నం చేసేందుకు 2 వేల మంది నేరగాళ్లను దించారని, కనీసం 50 మందిని చంపేయాలని ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ మూకల కుట్రను తెలుసుకున్న కేంద్రం దాన్ని అడ్డుకుందని చెప్పారు. సైకో జగన్ వైఖరి గురించి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని, కానీ, కేంద్రంలో నాయకులు కూడా ఒక్కోసారి ఏమీ చేయలేరని అన్నారు. ఏపీకి కేంద్రం అండగా నిలిచిందనే గౌరవం జగన్ కు లేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.