జడ్జి సూటి ప్రశ్న…గత ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరెందుకు లేదు?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలు, నేతలతోపాటు సామాన్యులను సైతం తొలిచివేస్తున్న ప్రశ్న ఒక్కటే. 2021లో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైతే ఇప్పుడు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? గతంలో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు ఇప్పుడు తాజాగా ఆయన పేరు చేర్చి అంత హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ కోర్టులో వాదనల సందర్భంగా న్యాయమూర్తికి కూడా ఇవే సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సిఐడి అధికారులను, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని న్యాయమూర్తి ఇవే ప్రశ్నలు అడిగారు.

ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును తాజాగా చేర్చడంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి…సీఐడీ, ఏఏజీకి ప్రశ్నలు సంధించారు. గతంలోని ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు పేరు ఎందుకు చేర్చారో చెప్పాలని నిలదీశారు. ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రమేయంపై తగిన ఆధారాలున్నాయా అని ఏఏజీని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.లాజికల్ గా జడ్జి అడిగిన ప్రశ్నలకు సీఐడీ అధికారులు,ఏఏజీ సుధాకర్ రెడ్డి ఖంగుతిన్నారని తెలుస్తోంది. ఆ ప్రశ్నల తర్వాత పది నిమిషాల పాటు వాదనలకు న్యాయమూర్తి బ్రేక్ ఇచ్చారు.

మరోసారి లూథ్రా వాదనలు విన్న తర్వాత చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ, బెయిల్ పై కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు కోర్టు హాల్‌లో వేచి చూస్తున్నారు. కోర్టుకు వచ్చిన నారా లోకేష్ ఈ కేసుపై ఎలా ముందుకెళ్లాలి..? అని టీడీపీ నేతలు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబుతో కూడా లోకేష్ సమావేశమైనట్లు తెలుస్తోంది.