కరోనా ఎఫెక్ట్…ప్రపంచవ్యాప్తంగా నమస్తేకు క్రేజ్

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు సంభవించాయి. కరోనా దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు….దాదాపుగా అందరి జీవనశైలి మారిపోయింది. ప్రజల జీవన విధానం…ఆలోచనా విధానం…జీవితంపై దృక్పథం…ఆఖరికి పలకరింపులో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కరోనా వల్ల చాలామంది మనుషుల మధ్య భౌతిక దూరం…కొంతమంది మనసుల మధ్య మానసిక దూరం పెరిగింది. కరోనాను కట్టడి చేసేందుకు మాస్కు మన ముఖంలో అంతర్భాగం అయిపోయింది. ఇక, కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది షేక్ హ్యాండ్ లకు స్వస్తి పలికారు. అదే సమయంలో, భారతీయ సంప్రదాయ అభివాదం అయిన నమస్కారాన్ని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు వరకు ఫాలో అవుతున్నారు. తాజాగా, ఈ జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మ్యాక్రాన్ , జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చేరిపోయారు. షేక్ హ్యాండ్‌కు బదులుగా భౌతిక దూరం పాటిస్తూ ఇండియన్ స్టయిల్‌లో నమస్తే అంటూ పరస్పరం అభివాదం చేసి పలకరించుకున్నారు. నమస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిందంటూ వీరిద్దరి నమస్తే వీడియోను ఆల్ ఇండియా రేడియో ట్వీట్ చేసింది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దక్షిణ ఫ్రాన్స్‌లోని తన వేసవి విడిదిలో మ్యాక్రాన్‌ ఏర్పాటు చేసిన విందుకు మెర్కెల్‌ హాజరయ్యారు. కరోనా కట్టడి, టర్కీతో సంబంధాలు, బెలారస్ వ్యవహారంపై చర్చించేందుకు వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెర్కెల్ కు నమస్తే చెప్పి ఆహ్వానించారు మ్యాక్రాన్. మ్యాక్రాన్ తో పాటు ఆయన సతీమణి కూడా నమస్తే చెప్పడంతో… వారికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన మెర్కెల్ కూడా నమస్కారానికి ప్రతి నమస్కారం చేశారు. ఆల్ ఇండియా రేడియో ఈ వీడియోను ట్వీట్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంప్రదాయ అభివాదం నమస్తే పాపులర్ అయిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మార్చి నెలలో స్పానిష్ రాజు, రాణిలతో భేటీ సందర్భంగా కూడా మ్యాక్రాన్ నమస్తే చెప్పారు. ఇక, మార్చి నెలలోనే ప్రిన్స్ చార్లెస్ కూడా నమస్తేతో ప్రజలకు అభివాదం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇక, ఇండియా గ్లోబల్ వీక్-2020 సందర్భంగా భారత ప్రధాని మోడీ కూడా కరోనా నేపథ్యంలో నమస్తే ప్రాధాన్యతను తెలియజేశారు.
ఇలా, నమస్తేతో ప్రపంచ దేశాల అధినేతలు పలకరించుకోవడం చూస్తుంటే భారతీయ విధానం ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శిగా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నమస్తే ట్రంప్‌కార్యక్రమాన్ని భారత్ ప్రభుత్వం నిర్వహించినప్పుడు ఈ నమస్తే ఏంటనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగింది. భారతీయ సంప్రదాయ అభివాదం అయిన నమస్తే పదాన్ని ట్రంప్‌ గౌరవార్ధం భారత్‌ వాడిందని అందరూ చర్చించుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో అంతా నమస్తే అనక తప్పని పరిస్థితి వస్తుందని మాత్రం ప్రపంచ దేశాల ప్రజలు ఊహించి ఉండరు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైన యోగా, ఆయుర్వేదం కూడా కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులర్ అయ్యాయి.