దాడులను ఎదుర్కొనేందుకు లోకేష్ కొత్త వ్యూహం?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు వైసిపి నేతలు….పోలీసుల సాయంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో తాడేరు వద్ద యువగళం పాదయాత్ర సందర్భంగా టిడిపి కార్యకర్తలపై, నేతలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్విన ఘటన సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఆ ఘటన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన స్ట్రాటజీ మార్చారు.

ఇకపై, ఇటువంటి దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు, దాడులు చేసిన వారిని సాక్షాధారాలతో సహా పట్టుకునేందుకు వ్యూహం రచించారని తెలుస్తోంది. పోలీసులు కూడా దాడి చేసిన వారికి అండగా ఉంటున్న నేపథ్యంలో వైసీపీ మూకలను పట్టుకునేందుకు లోకేష్ ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కొంతమంది భద్రతా సిబ్బదిని ప్రత్యేకించి ఇటువంటి దాడులను అడ్డుకునేందుకు నియమించే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. దాడులు జరిగితే వాటిని రికార్డు చేసి సాక్షాధారాలతో సహా మీడియా, సోషల్ మీడియాలో పెట్టి వారి గుట్టు రట్టు చేసే యోచనలో లోకేష్ ఉన్నారని తెలుస్తోంది.

పోలీసులు కూడా వైసీపీ శ్రేణులకు అండగా ఉండి టీడీపీ నేతలపై, కార్యకర్తలపై కేసులు పెడుతున్న నేపథ్యంలో..న్యాయపోరాటం చేసే దిశగా కూడా లోకేష్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ఆదేశాలతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నామని, ఇకపై దాడులను దీటుగా ఎదుర్కోవాలని, కార్యకర్తలకు, నేతలకు కూడా లోకేష్ పిలుపునిచ్చారని తెలుస్తోంది. అంతకుముందు, జగన్ పై లోకేష్ పైర్ అయిన సంగతి తెలిసిందే. ఇది పోలీసుల వైఫల్యం అని, రోడ్డు పక్కన ఉన్న భవనాలు ఎక్కి మరీ దాడి చేశారని లోకేష్ ఆరోపించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులు రక్షణగా నిలిచారని లోకేష్ మండిపడ్డారు.

ఈ ఘటనపై టిడిపి నేత బోండా ఉమా ఫైర్ అయ్యారు. కేవలం పాదయాత్రకు ఆటంకం కలిగించే ఉద్దేశంతోనే ఒక పథకం ప్రకారం జగన్ ఈ గొడవలు చేస్తున్నారని ఉమా ఆరోపించారు. లోకేష్ పాదయాత్రకు అనూహ్యమైన ప్రజాస్పందన వస్తుందని, దానిని చూసి భయపడే వైసిపి ఇటువంటి పనులు చేస్తుందని మండిపడ్డారు. యువగళం వాలంటీర్లపై దాడి చేసి వారి పైన కేసు పెట్టారని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్న ప్రాంతానికి వైసిపి గూండాలను ఎలా అనుమతిస్తారని ఉమ ప్రశ్నించారు. లోకేష్ కు భద్రత పెంచాలని ఎన్నోసార్లు డీజీపీకి లేఖ రాసినా స్పందించడంలేదని విమర్శలు గుప్పించారు. పాదయాత్రను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.