రౌడీల‌తో దాడులు చేయిస్తున్నాడు: జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఫైర్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. టీడీపీ నాయకుల‌పై రౌడీల‌తో దాడులు చేయిస్తున్నాడంటూ.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న ప్ర‌జావేదిక లో మాట్లాడుతూ.. నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జ‌రిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్ర‌జాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“యువ‌గ‌ళంలో ఎందుకు దాడులు చేయించారు. బాధితుల‌పైనే ఎందుకు కేసులు పెడుతున్నారు” అని చంద్ర‌బాబు నిల‌దీశారు. సీఎం జ‌గ‌న్‌ను క‌ర‌డు గ‌ట్టిన సైకో అని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ పెట్టి రివర్స్ పాలనకు తెరతీశారని విరుచుకుపడ్డారు. బటన్ నొక్కడం ఒక్కటే జ‌గ‌న్‌కు తెలుసని ఎద్దేవా చేశారు. ఈ సైకో ముఖ్య‌మంత్రి నుంచి రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను కాపాడాల్సిన అవసరం ఉందని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

“నేను ష్యూరిటీ ఇస్తున్నా పేదలను ధనవంతులుగా మారుస్తా” అని చంద్ర‌బాబు వాగ్దానం చేశారు. తమ పైన కేసులు పెట్టి లండన్‌లో ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో.. ఏం చేస్తున్నారో అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసి… మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని త‌న‌ను రోడ్డుకు లాగార‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

త‌న‌పైనా, త‌న కుటుంబ‌స‌భ్యుల‌పైనా అనేక రకాలుగా అపవాదులు వేశారని… రివర్స్‌లో కేసులు పెడుతున్నారని చంద్ర‌బాబు మండిపడ్డారు. అంగళ్లలో తన మీద హత్యాప్రయత్నం చేసి పైగా తన మీదే 307 కేసు పెట్టారని, తాను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తడి చేస్తూ పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి స్టేట్‌మెంట్ రాయిస్తున్నార‌ని అన్నారు.