అభ్యర్ధుల్లో మార్పులు తప్పవా ?

జమిలి ఎన్నికలు తెలంగాణాలోని అన్నీ పార్టీలను అయోమయంలోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా కేసీయార్ ను బాగా కలవరపెట్టేస్తోంది. కారణం ఏమిటంటే 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేయటమే. కేసీయార్ అభ్యర్ధుల ప్రకటన పూర్తియిన తర్వాత నరేంద్రమోడీ జమిలి ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో కేసీయార్ కు ఒక విధంగా దిమ్మతిరిగిందనే చెప్పాలి. ఇపుడు గనుక జమిలి ఎన్నికలు జరిగితే కేసీయార్ కు చాలా సమస్యలు తప్పేట్లు లేదు. ప్రధానమైన సమస్య ఏమిటంటే అభ్యర్ధుల్లో మార్పులు చేయక తప్పదట.

ఎందుకంటే ఎంఎల్ఏ అభ్యర్ధులను విడిగా, ఎంపీ అభ్యర్ధులను విడిగా కేసీయార్ రెడీచేసుకున్నారు. మరిపుడు రెండు ఎన్నికలు ఒకేసారి జరిగేట్లయితే అభ్యర్ధులను మార్పులు చేయక తప్పేట్లులేదు. ఎందుకంటే మంత్రులు, ఎంఎల్ఏల్లో బలమైన అభ్యర్ధులను ఎంపీలుగా ఎంపిక చేయబోతున్నారట. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఓడిపోయినా తర్వాత వాళ్ళల్లోనే కొందరిని ఎంపీలుగా పోటీచేయించాలని అనుకున్నారట. కానీ ఇపుడు సీన్ మొత్తం రివర్సయ్యేట్లుంది.

అందుకనే ఇపుడు అభ్యర్ధులు నియోజకవర్గాలో ప్రచారానికి వెళ్ళకపోయినా పట్టించుకోవటంలేదట. కొందరిని అయితే కేసీయార్ ప్రచారానికి వెళ్ళవద్దని కూడా సూచిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రకటించిన అభ్యర్ధుల్లో కొందరిని ఉపసంహరించి ఎంపీలుగా రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నారట. దీనివల్ల మొత్తం జాబితాలో చాలా మార్పులే చేయాల్సొచ్చేట్లుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను దింపాలంటే ఆ మేరకు కొంతమందినైనా మంత్రులు, ఎంఎల్ఏలను రంగంలోకి దింపాల్సుంటుంది.

అందుకనే అసెంబ్లీ అభ్యర్ధుల్ల మార్పులుంటాయనే సంకేతాలను పంపుతున్నారు. దీంతో అభ్యర్ధులు కూడా ఫుల్లు హ్యాపీ ఫీలవుతున్నారట. ఎందుకంటే నాలుగు నెలల ముందే అభ్యర్ధులను కేసీయార్ ప్రకటించారు కానీ వాళ్ళు మాత్రం ఖర్చులను తట్టుకోలేకపోతున్నారట. ప్రచారం ఖర్చులు, పంచాయితీలకు విపరీతమైన ఖర్చలవుతున్నాయట. నేతలు అడిగినంత ఖర్చులు పెట్టకపోతే అలిగి ఎక్కడ వ్యతిరేకం చేస్తారో అనే భయం పెరిగిపోతోంది. దీంతో చాలామంది ప్రచారానికే వెళ్ళాలంటే భయపడుతున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో కేసీయార్ సూచనలు వీళ్ళందరికీ హ్యాపీ అనిపిస్తోంది. మొత్తంమీద నరేంద్రమోడీ జమిలి పేరుతో కేసీయార్ ను పూర్తి డిఫెన్సులో పడేసినట్లే ఉన్నారు.