ఆనాడు షర్మిల తెలంగాణ కోడలు కాదా?

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టిపి విలీనం వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. షర్మిల తెలంగాణ కోడలు ఎలా అవుతుందని? ఆమె ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలని తెలంగాణకు చెందిన సీనియర్ పొలిటిషన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ వ్యతిరేకి అని, అటువంటి వ్యక్తి తనయురాలు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటే నమ్మశక్యంగా లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనను సగం తెలంగాణవాడిగానైనా చూడాలని వైయస్సార్ ఆత్మ, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో కలవరం రేపింది.

ప్రాణం పోయిన తర్వాత కూడా తాను తెలంగాణ మట్టిలో కలుస్తానని, ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలోనే ఉంటున్నానని కేవీపీ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఏపీ విభజించవద్దు అని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు కెవిపికి తెలంగాణ గుర్తుకు రాలేదా అని వీహెచ్ ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఏపీలో బలహీనంగా ఉందని, అందుకే ఏపీకి వెళ్లి పార్టీని కేవీపీ బలోపేతం చేస్తే బాగుంటుందని వీహెచ్ హితవు పలికారు.

ఇక, వైయస్ షర్మిలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కూడా షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా పాలేరులో షర్మిల పోటీ చేస్తానననడంపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అన్న విషయంపై అధిష్టానం నిర్ణయం తీసుకోలేదని ఆమె అన్నారు. షర్మిలకు తాను తెలంగాణ కోడలినని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ రేణుకా చౌదరి చురకలంటించారు. అయినా, ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని? ముందు అమరావతి రైతుల గురించి షర్మిల మాట్లాడాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, తాను ఏపీకి కోడలినని, తెలంగాణ ఆడబిడ్డనని రేణుక చెప్పారు.