జగన్ కేసు చార్జిషీట్ లో వైఎస్ పేరు.. షర్మిల క్లారిటీ

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీ విలీనం వ్యవహారంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ విలీనంపై చర్చలు తుది దశకు వచ్చాయని షర్మిల అన్నారు. తన తండ్రి వైఎస్ఆర్ ను సోనియా గాంధీ గౌరవిస్తున్నారని, అందుకే చర్చలకు ఢిల్లీ వెళ్లానని షర్మిల చెప్పారు. వైఎస్సార్ కుటుంబానికి సోనియా ద్రోహం చేయలేదని షర్మిల అన్నారు. వైఎస్సార్ అంటే కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉందని చెప్పారు. అయితే, ఆనాడు జగన్ అక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరుని చేర్చిన విషయం సోనియాకు తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మా వాళ్లు కూడా సోనియానే ఆ పని చేయించారని అనుకున్నారని, తనను ప్రశ్నించారని షర్మిల అన్నారు. అందుకే, ఈ క్లారిటీనివ్వాల్సి వచ్చిందని చెప్పారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా సీబీఐ చార్జిషీటులో ఆబ్ స్కాండర్ గా రాజీవ్ గాంధీ పేరును చేర్చారని, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని సోనియా గాంధీ తనతో చెప్పారని అన్నారు. అటువంటిది, తాము వైఎస్ పేరు ఎలా చేరుస్తామని చెప్పారని షర్మిల క్లారిటీనిచ్చారు. ఇక, వైఎస్ఆర్ లేని లోటు తమకు తెలుస్తోందని రాహుల్ గాంధీ చెప్పినట్లు షర్మిల అన్నారు.

కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించేందుకే సోనియాతో చర్చలు జరిపానని షర్మిల అన్నారు. అయితే, తమ పార్టీ కేడర్ తో చర్చలు జరిపిన తర్వాతే విలీనంపై మీడియాతో మాట్లాడుతానని షర్మిల అన్నారు. త్వరలోనే అన్ని వివరాలను తెలియజేస్తానని చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలోని అన్ని పార్టీలు కలిసి రావాలని షర్మిల కోరారు. తెలంగాణలో తాను 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని, తనతో పాటు నడిచిన వారిని నిలబెడతానని అన్నారు. ఇక, ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వెళ్లిన షర్మిల తన తండ్రి వైఎస్ఆర్ కు నివాళులర్పించారు.

ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి సీఎం జగన్, షర్మిల విడివిడిగా హాజరయ్యారు. అయితే, విలీనంపై ఇడుపులపాయ దగ్గర మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు షర్మిల సమాధానమివ్వలేదు. ఆ తర్వాత హైదరాబాద్ లోని పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.