కాంగ్రెస్ ఎంఎల్ఏల మీద మండిపోతున్న రేవంత్

చదవటానికి కాస్త ఆశ్చర్యంగా ఉందా ? పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏమిటి సొంతపార్టీ ఎంఎల్ఏల మీద మండిపోవటం ఏమిటి అనుకుంటున్నారా ? మండుతున్నది నిజమే కానీ ఇపుడు పార్టీలో ఉన్న ఎంఎల్ఏల మీదకాదు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధులుగా గెలిచి తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వాళ్ళమీద. అలా ఫిరాయించిన ఎంఎల్ఏలు 12 మంది ఉన్నారట. వాళ్ళల్లో ఒక్కళ్ళని కూడా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ గేటు కూడా తాకనిచ్చేది లేదని సవాలు చేశారు.

కందాళం ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధనరెడ్డి లాంటి 12 మంది ఎంఎల్ఏలు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. వెళ్ళేవాళ్ళు పార్టీకి రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్ ఎంఎల్ఏలుగానే బీఆర్ఎస్ లో చెలామణి అవుతున్నారు. ఇదే విషయమై రేవంత్ మాట్లాడుతు కాంగ్రెస్ లీడర్లంతా ఏకమై బీఆర్ఎస్ అభ్యర్ధులకు చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎంఎల్ఏలకు రాబోయే ఎన్నికల్లో కేసీయార్ మళ్ళీ టికెట్లు ప్రకటించారు. దాంతో అందరు ఈసారి అచ్చంగా బీఆర్ఎస్ టికెట్ పైనే పోటీకి రెడీ అవుతున్నారు. మరి ఈ 12 మందిపైన కాంగ్రెస్ తరపున ఎవరిని పోటీకి దింపబోతున్నది రేవంత్ ఎక్కడా చెప్పలేదు. దాంతో వీళ్ళ పోటీపై ఆయా నియోజకవర్గాల్లో ఆసక్తి బాగా పెరిగిపోతోంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే కాంగ్రెస్ లో చేరితే కొత్తగూడెంలో జలగం వెంకటరావు బీఆర్ఎస్ అభ్యర్ధి వనమాపై పోటీచేయచ్చు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరితే కందాళంపైన పోటీచేయచ్చు.

బహుశా హర్షవర్ధన్ రెడ్డిపైన జూపల్లి కృష్ణారావు పోటీచేసే అవకాశముంది. మరి మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను ఫైనల్ చేయాల్సుంటంది. అప్పుడు పోటీ మంచి రసకందాయంలో పడుతుందనే అనుకోవాలి. గెలుపు ఓటములను పక్కనపెట్టేస్తే పోటీయే మహారంజుగా ఉంటుందనటంలో సందేహంలేదు. అభ్యర్ధులను ఫైనల్ చేసేదేదో వెంటనే చేసేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కురుక్షేత్రాన్ని తలపించటం ఖాయం.