తుమ్మల రాక.. పొంగులేటికి పొగ

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక స్థానం నుంచి కచ్చితంగా పోటీ చేస్తామనే ధీమాతో ఉన్నప్పటికీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తప్పుకోక తప్పదు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే మారనుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావే కారణంగా మారనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు తుమ్మల నాగేశ్వర రావు సిద్ధమయ్యారు. కానీ కేసీఆర్ మాత్రం అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మరోసారి టికెట్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేసిన తుమ్మల వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు తాజాగా తుమ్మలను కలిశారు. కాంగ్రెస్లో చేరాలని కోరారు. దీనిపై తుమ్మల సానుకూలంగానే స్పందించారని తెలిసింది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలున్నాయని సమాచారం.

కాంగ్రెస్లో చేరితే తుమ్మలకు పాలేరు టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇదే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి తలనొప్పిగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్లో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్ కోసం పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మూడు నియోజకవర్గాల నుంచి పొంగులేటి దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. మరి తుమ్మల వచ్చి పాలేరు నుంచి పోటీ చేస్తే.. అప్పుడు పొంగులేటి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.