ముందు తెలంగాణ, తర్వాతే ఏపీ..?

వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కొంతకాలం తెలంగాణకే పరిమితం కానున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. షర్మిల గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలుసుకున్నారు వారితో కలిసి అల్పాహారం విందు చేసి చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం బయటకు వచ్చిన షర్మిల విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆమె తెలంగాణకు పరిమితం అవుతారా, లేక ఆంధ్ర రాజకీయాల్లో కూడా కాలు పెడతారా అనే వాదనకు తెర లేపింది.

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గత కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్లి రావటం, ఆమెకు మద్దతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం.. ఇవన్నీ కొంత చర్చకు దారి తీసింది. ఆ వెంటనే షర్మిల గజ్వేల్ కు బయలుదేరారు. తమకు దళిత బంధు అందడం లేదని కొందరు గ్రామస్తులు చెప్పడంతో ఆమె వెళ్ళడానికి సిద్ధం అవడంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కూడా ఆమె కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనంగా ఉంది. అక్కడ షర్మిలను వినియోగించు కోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. జగన్ వదిలిన బాణాన్ని ఆయనపైనే గురి పెట్టించడం కాంగ్రెస్ ఎత్తుగడ. కాగా మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాత వచ్చే ఏడాది మేలో ఏపీలో ఎన్నికలు ఉంటాయి. ముందుగా జరిగే తెలంగాణ ఎన్నికల్లో షర్మిలను వినియోగించుకుని ఆ తర్వాత ఏపీకి పంపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సమయం ఉంది కదా అని, తొందరపడి ఏపీ రాజకీయాలు గురించి షర్మిల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం లేదని తెలుస్తోంది.